
బహ్రెయిన్లో 9 మంది అరెస్ట్
● సాయం కోసం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు
జగిత్యాలక్రైం: ఉన్న ఊరిలో ఉపాధి లేక గల్ఫ్ దేశం వెళ్లిన కార్మికులు చేయని తప్పునకు అక్కడ శిక్ష అనుభవిస్తున్నారు. బహ్రెయిన్లో ఆల్ మోయ్యాద్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్న 9 మంది తెలంగాణ కార్మికులను ఇంధనం దుర్వినియోగం కేసులో ఇటీవల అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన బొమ్మడి సుదర్శన్ బహ్రెయిన్లో డ్రైవర్గా పనిచేస్తాడు. ఆయనతోపాటు మరో 8 మందిని ఈనెల 4న అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి న్యాయ సహాయం అందించాలని సుదర్శన్ కుమారుడు నితిన్ మంగళవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లోని ప్రవాసి ప్రజావాణిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేశ్రెడ్డి, గుగ్గిళ్ల రవిగౌడ్, నంగి దేవేందర్రెడ్డి, బొజ్జ అమరేందర్రెడ్డితో కలిసి వినతిపత్రం సమర్పించారు.
స్టైఫండ్ చెల్లించాలంటూ ధర్నా
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నగునూరులోని ప్రతిమ మెడికల్ కళాశాల హౌజ్సర్జన్లు స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు హౌజ్సర్జన్లు మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ప్రతి హౌజ్సర్జన్కు నెలకు రూ.25వేల స్టైఫండ్ చెల్లిస్తోందన్నారు. కళాశాల యాజమాన్యం ఎవరికీ స్టైఫండ్ ఇవ్వడం లేదని ఆరోపించారు. హైదరాబాద్లోని పలు మెడికల్ కళాశాలలు స్టైఫండ్ చెల్లిస్తున్నాయని తెలిపారు. ఆస్పత్రిలో హౌజ్సర్జన్లు, పీజీ వైద్యులు పనిచేస్తున్నప్పటికీ.. ఎలాంటి స్టైఫండ్ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్టైఫండ్ చెల్లించేవరకు ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని తెలిపారు.

బహ్రెయిన్లో 9 మంది అరెస్ట్