
సేవతోనే ప్రజల్లో గుర్తింపు
● ఎమ్మెల్యే సంజయ్కుమార్
జగిత్యాలరూరల్: సేవాకార్యక్రమాల ద్వారానే ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాలరూరల్ మండం అంతర్గాంలో జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు జగిత్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో వైద్యులు సేవాభావంతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వైద్యులు దేవుడితో సమానమని ప్రజలు భావిస్తారని అన్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో దేశంలో దాదాపు 7వేల గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని రంగాలతోపాటు వైద్య రంగంలోనూ అనేక మార్పులు వచ్చాయని, వాటికి తగినట్లు వైద్యులు కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. రోగం వచ్చాక చికిత్స కన్నా రోగం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ శ్రీనివాస్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ హేమంత్, కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి కోటగిరి సునీల్, సీనియర్ వైద్యులు పద్మిని, నాగరాజు, రాజశేఖర్, స్వరూప, రజిత, విజయ్, గీతిక, శ్రీధర్, శ్రీనివాస్, నవీన్, శ్రావణ్, పూర్ణ చంద్ర, సాయికిరణ్, అర్జున్, ధీరజ్ పాల్గొన్నారు.