
‘టెలిగ్రాం’ చీఫ్ పావెల్ దురోవ్ ప్రకటన
లండన్: మెసేజింగ్ యాప్ టెలిగ్రాం వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్(40) సంచలన ప్రకటన చేశారు. వీర్య దానం ద్వారా తాను తండ్రినయిన 100 మందికిపైగా సంతానానికి తనకున్న 13.9 బిలియన్ డాలర్ల ఆస్తిని పంచుతానని తెలిపారు. ‘వాళ్లంతా నా పిల్లలే. నా ఆస్తిలో వాళ్లకూ సమాన హక్కులుంటాయి. నా మరణం తర్వాత వారికి అన్యాయం జరగాలని కోరుకోవడం లేదు’అని దురోవ్ చెప్పినట్లు ఫ్రాన్స్ పత్రిక ‘లీ పాయింట్’పేర్కొంది.
ముగ్గురు భాగస్వాముల ద్వారా ఆరుగురు సంతానికి అధికారికంగా తండ్రినని దురోవ్ చెప్పారు. ‘ఒక ఫ్రెండ్కు సాయం చేసేందుకు గాను 15 ఏళ్ల క్రితం వీర్య దానం మొదలుపెట్టా. అలా 12 దేశాల్లో 100 మందికి పైగా పిల్లలు పుట్టినట్లు నా ఫ్రెండ్ చెప్పారు’అని ఆయన వెల్లడించారు. ‘వీరందరికీ నా ఆస్తిలో వాటా ఇస్తా. అయితే, ఇప్పుడు కాదు, 30 ఏళ్ల తర్వాతే వారికి ఈ అవకాశం దక్కుతుంది. ఈ మేరకు వీలునామా రాశా’అని చెప్పారు.
‘నా ఉద్యోగం ఎన్నో రిస్క్లతో కూడుకున్నది. స్వతంత్య్రాన్ని కాపాడుకునే క్రమంలో ఎందరో శత్రువులు కూడా తయారయ్యారు. కొన్ని దేశాలు కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే ముందుగానే ఏర్పాట్లు చేశా’అని దురోవ్ చెప్పారు. ‘నా ద్వారా కలిగిన పిల్లలంతా సామాన్యుల మాదిరిగానే ఉండాలన్నది నా కోరిక. తమ జీవితాన్ని తామే నిర్మించుకోవాలి. ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి.
బ్యాంకు అక్కౌంట్పై ఆధారపడకుండా సొంతంగా ఎదగాలి’అని కోరుకున్నారు. రష్యాలో జన్మించిన పావెల్ దురోవ్కు ఫ్రాన్స్, యూఈఏ ద్వంద పౌరసత్వముంది. ఇతడు సీఈవోగా ఉన్న టెలిగ్రాం యాప్ ప్రధాన కార్యాలయం యూఏఈలో ఉంది. ప్రస్తుతం దుబాయ్లో పావెల్ దురోవ్ ఉంటున్నారు. టెలిగ్రాం యాప్ నేరగాళ్లకు అడ్డాగా మారిందని ఆరోపిస్తూ ఫ్రాన్స్ అధికారులు గతేడాది అరెస్ట్ చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ..‘నా యాప్ను నేరగాళ్లు వినియోగించుకున్నారని, నన్నూ నేరగాడంటే ఎలా? అని ప్రశి్నస్తున్నారు.