కాళ్ల బేరానికి పాక్‌.. ‘సింధు ఒ‍ప్పందం’పై వేడుకోలు | Water Crisis In Pakistan, Wrote Four Letters To India On Indus Treaty | Sakshi
Sakshi News home page

కాళ్ల బేరానికి పాక్‌.. ‘సింధు ఒ‍ప్పందం’పై వేడుకోలు

Jun 7 2025 7:36 AM | Updated on Jun 7 2025 8:58 AM

Staring at Crisis Pakistan wrote 4 Letters to India

న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా పాకిస్తాన్‌ను ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. దీని​కితోడు ఇటీవల భారత్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడుల అనంతరం ఆ దేశాన్ని మరిన్ని సమస్యలు చుట్టుముట్టాయి. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్‌ హస్తం ఉందంటూ, భారత్‌ సింధు జలాల ఒప్పందాన్ని (ఐడబ్ల్యూటీ)నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన పాకిస్తాన్‌ కాళ్లబేరానికి వచ్చి, భారత్‌కు ఈ విషయమై పునరాలోచించాలని కోరుతూ లేఖ రాసింది.

ఇప్పటికే పాకిస్తాన్ నీటి సంక్షోభాన్ని  ఎదుర్కొంటోంది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో, భారత్‌ సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై నిర్ణయం తీసుకోవడంతో పాకిస్తాన్‌ మరింత ఆందోళనకు లోనయ్యింది. వెంటనే తేరుకున్న ఆ దేశ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా తాజాగా ఐడబ్ల్యూటీని పునరుద్ధరించాలని కోరుతూ,  భారత జల్ శక్తి మంత్రిత్వ శాఖకు నాలుగు లేఖలు రాశారు. వీటిని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) పరిశీలనకు పంపినట్లు జల్ శక్తి మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి ఉండలేవని, రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని పాకిస్తాన్‌కు భారతదేశం ఇప్పటికే స్పష్టం చేసింది. ఐడబ్ల్యూటీని పరస్పర నమ్మకం, స్నేహబంధం మేరకు రూపొందించినప్పటికీ, పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా  ఈ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించిందని భారత్‌ పేర్కొంది. భారత్‌ తన జాతీయ భద్రతా అధికారాన్ని ప్రయోగిస్తూ.. ఇస్లామాబాద్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ముగించే వరకు ఈ ఒప్పందం నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్‌) ఈ నిర్ణయాన్ని ఆమోదించింది.

పాక్‌లో నెలకొన్న నీటి సంక్షోభాన్ని తక్షణం  పరిష్కరించకపోతే దేశంలోని ప్రజలు చనిపోతారని, తమ దేశానికి వచ్చే నీటిలో మూడు వంతులు దేశం వెలుపల నుండి వస్తున్నందని పాక్‌ సెనేటర్ సయ్యద్ అలీ జాఫర్ ఇటీవల పేర్కొన్నారు. సింధూ బేసిన్‌ పాక్‌ జీవనాడి అని, ఈ దేశంలోని ప్రతీ 10 మందిలో తొమ్మిది మంది తమ జీవనోపాధి కోసం సింధు నీటిపై ఆధారపడతారని ఆయన అన్నారు.  దేశంలో పండించే పంటలలో 90 శాతం సింధు జలాలపైనే ఆధారపడి ఉన్నాయని, పలు విద్యుత్ ప్రాజెక్టులు, ఆనకట్టలన్నీ దానిపైనే నిర్మితమయ్యాయని సయ్యద్ అలీ జాఫర్ తెలిపారు.

ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌ ఎన్నికలపై యూనస్ కీలక ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement