
మాస్కో: ‘ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంలో తాము భాగస్వాములం కావొచ్చు. కాకపోవచ్చు’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రష్యా ఒకడుగు ముందకేసి మరీ హెచ్చరించింది. ఇరాన్పై అమెరికా సైనిక చర్యకు దిగడం సరైన చర్య కాదంటూ హెచ్చరించింది. ఇజ్రాయిల్-ఇరాన్ల యుద్ధంలో అమెరికా సైనిక చర్యకు దిగితే అది ఎంతమాత్రం సమర్థనీయంగా కాదని రష్యా విదేశాంగా ప్రతినిధి మారియా జకారోవా స్పష్టం చేశారు. ‘
అమెరికాను ముందుగా హెచ్చరించే విషయం ఏంటంటే.. ‘ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధానికి అమెరికా దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ అమెరికా సైనిక చర్యకు దిగితే అది దుస్సాహసమే అవుతుంది. ఈ యుద్ధంలో ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సైనిక చర్యకు దిగడం అనేది చాలా ప్రమాదకరం. ఊహించని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. ఆ యోచనను పక్కన పెడితేనే మంచిది’ అని ఆమె స్పష్టం చేశారు.
మరొకవైపు ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడి చెర్నోబిల్(1986లో ఉక్రెయిన్లో సంభవించిన ఒక పెద్ద అణు విపత్తే చెర్నోబిల్. అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్ పేలిపోయి, రేడియోధార్మిక పదార్థాలు గాలిలోకి విడుదలయ్యాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు ప్రమాదాలలో ఒకటిగా లెక్కించబడింది) తరహా విపత్తుకు దారితీయవచ్చని రష్యా అణుశక్తి కార్పొరేషన్ సైతం హెచ్చరించింది.
కాగా, ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య యుద్ధం భీకర రూపాన్ని దాల్చింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్లోని పలు నగరాల్లో బీభత్సం సృష్టించాయి. టెలీ అవీవ్, రామత్గాన్, హోలోన్, బెర్జీబా నగరాలపై ఇరాన్ విరుచుకుపడింది. దీంతో, భయానక వాతావరణం నెలకొంది. బీర్షెబాలోని సోరోకా ఆసుప్రతిపై ఇరాన్ దాడి చేయడంతో భవనం పూర్తిగా దెబ్బతింది.
ఇజ్రాయిల్ దాడులతో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా వరకు ధ్వంసమైంది. ఎటు నుంచి ఇజ్రాయెల్ క్షిపణులు మీదొచ్చి పడతాయోనన్న భయాలు ఇరాన్ ప్రజల్లో కనిపిస్తోంది. చాలా నగరాలు నిశ్శబ్దంగా రోదిస్తున్నాయి. వలసదారులు తప్పితే ఇరాన్ నగరాల రోడ్లపై ఎవరూ కనిపించడం లేదు.