
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మిసిసిప్పీ రాష్ట్రంలోని ఓ పాఠశాల సమీపంలో విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 12మందికిపైగా గాయపడ్డారు.
పోలీసుల వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి మిస్సిస్సిప్పి రాష్ట్రం లేలాండ్ నగరంలో అర్ధరాత్రి ఫుట్బాల్ ఆట ముగిసిన తర్వాత 18ఏళ్ల బాలుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మరణించగా, 12 మంది గాయపడ్డారని బీబీసీ నివేదించింది. శుక్రవారం రాత్రి రద్దీగా ఉండే సమయంలో లేలాండ్ ప్రధాన వీధిలో కాల్పులు జరిగాయని నగర మేయర్ మేయర్ జాన్ లీ తెలిపారు.
ఈ కాల్పుల ఘటనకు ముందు ఓ స్కూల్ సమీపంలో పాఠశాలల పూర్వ విద్యార్థులను స్వాగతించే వార్షిక అమెరికన్ సంప్రదాయ ఫుట్బాల్, ఇతర కమ్యూనిటీ ఈవెంట్లు జరిగాయి. ఈ ఈవెంట్లో నిందితుడు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. కాల్పులతో వేడుక విషాదంగా ముగిసింది.
అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నాయని, నిందితుల్ని గుర్తించేందు ప్రత్యక్షసాక్షులు ముందుకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కాల్పులు జరిపింది 18 ఏళ్ల యువకుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానితుడి కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు.