అంతా భారత్‌ ఇష్టమేనా?.. దేనికైనా రెడీ.. పాక్‌ ప్రధాని సంచలన వ్యాఖ్యలు | Pakistan PM Shehbaz Sharif Reacts To Pahalgam Incident | Sakshi
Sakshi News home page

అంతా భారత్‌ ఇష్టమేనా?.. దేనికైనా రెడీ.. పాక్‌ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

Apr 26 2025 12:45 PM | Updated on Apr 26 2025 1:49 PM

Pakistan PM Shehbaz Sharif Reacts To Pahalgam Incident

ఇస్లామాబాద్‌: భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాక్‌ ప్రధాని షెహబాబ్‌ షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. భారత్‌ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు అంటూ కామెంట్స్‌ చేశారు.

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్‌ పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌ పౌరులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని, నదుల విషయంలో కూడా నీటిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీష్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ ఇటీవల భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై షరీఫ్‌ పరోక్షంగా స్పందించారు.

ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని పాకిస్తాన్‌ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్‌ వేడుకల్లో పాక్‌ ప్రధాని షరీఫ్‌ మాట్లాడుతూ..‘మా దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోం. ఎలాంటి ముప్పును ఎదుర్కోడానికైనా సంసిద్ధంగా ఉన్నాం. పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యం. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశం కరెక్ట్‌ కాదు. భారత్‌ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. ఈ చర్యతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అంటూ భారత్‌ను నిందించే ప్రయత్నం చేశారు. చివరగా.. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ చెప్పుకొచ్చారు. పహల్గాం  దాడి (Pahalgam)పై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement