ప్రపంచదేశాలకు ఇరాన్ మరోసారి పెద్ద షాక్ ఇచ్చింది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా తాజా వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ ప్రకటించింది. ఇకపై చమురు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు, వాణిజ్య నౌకలు సహా ఏ దేశానికి చెందిన ఓడకూ హర్ముజ్ మార్గంలో ప్రయాణానికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ఇరాన్ హెచ్చరికలు ఇంతటితో ఆగలేదు.
నిషేధాన్ని ఉల్లంఘించి ఎవరైనా హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే క్షిపణులు, నౌకాదళ బలగాలతో లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేస్తామని ఇరాన్ సైనికాధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇటు అంతర్జాతీయంగానూ తీవ్ర ఆందోళన నెలకొంది.
హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గం. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో తరలించే చమురు, సహజ వాయువులో దాదాపు 20 శాతం ఈ జలసంధి ద్వారానే గమ్యస్థానాలకు చేరుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల ఇంధన ఎగుమతులకు ఇదే ప్రధాన మార్గం. అందుకే హర్ముజ్ మూసివేత ప్రపంచ ఇంధన మార్కెట్లకు భారీ షాక్గా మారింది.
ఇరాన్ ప్రకటన వెలువడగానే అంతర్జాతీయ చమురు మార్కెట్లు కుదేలయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా బ్యారెల్కు రెండు డాలర్లకుపైగా పెరిగాయి. సరఫరా సంక్షోభం మరింత తీవ్రమైతే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇంధన విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు, అమెరికా మాత్రం పరిస్థితి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని చెబుతోంది. కొన్ని వాణిజ్య నౌకలు ఇప్పటికీ ప్రాంతంలో ప్రయాణిస్తున్నాయని, తమ యుద్ధనౌకలపై ఎలాంటి దాడులు జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే ఇరాన్ హెచ్చరికలతో అనేక నౌకా సంస్థలు ఇప్పటికే తమ ప్రయాణాలను నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఈ పరిణామాలతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదలతో పాటు రవాణా వ్యయాలు, ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం మళ్లీ తలెత్తే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా–ఇరాన్ ఘర్షణ మరింత ముదిరితే హర్ముజ్ జలసంధి అంశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపే కీలక సంక్షోభంగా మారే అవకాశం కనిపిస్తోంది.


