గాజాలో... ఆకలి కేకలు! | Human-made hunger crisis in Gaza says UNRWA senior official explains | Sakshi
Sakshi News home page

గాజాలో... ఆకలి కేకలు!

Jun 23 2025 4:50 AM | Updated on Jun 23 2025 4:50 AM

Human-made hunger crisis in Gaza says UNRWA senior official explains

గాజా: 2023 అక్టోబర్‌ 7వ తేదీన ఇజ్రాయెల్‌ సరిహద్దు ప్రాంతంపై మెరుపుదాడి చేపట్టిన హమాస్‌ ఇతర జిహాదీలు 1,195 మందిని చంపేయడంతోపాటు 251 మందిని బందీలుగా పట్టుకుపోయారు. ఆ ఒక్క ఘటన..దశాబ్దాలుగా శరణార్థులుగా సొంత ప్రాంతంలోనే బతుకులీడుస్తున్న పాలస్తీనా ప్రజలను అత్యంత తీవ్రమైన కష్టాల్లోకి నెట్టివేసింది. 

శక్తివంతమైన ఇజ్రాయెల్‌ సైన్యం ఆ రోజు నుంచి గాజాపై యథేచ్ఛగా దాడులు సాగిస్తూ 50 వేల మందిని పొట్టనబెట్టుకోవడంతోపాటు సుమారు లక్షన్నర మందిని క్షతగాత్రులుగా మార్చేసింది. జిహాదీ గ్రూపులు బందీలను విడుదల చేయలేదనే సాకుతో గాజాను కొన్ని నెలలుగా పూర్తిగా దిగ్బంధంలో ఉంచింది. నీరు, ఆహారం, మందులు, ఇతర అత్యవసరాలను సైతం అందకుండా చేసింది. దీంతో ఈ ఆ ప్రాంతంలోని 22% మంది, 4.70 లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.

 అత్యంత కీలకమైన ఆస్పత్రులు, నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఆస్పత్రుల్లో వసతులు, మందులు కరువై సరైన వైద్యం అందక, మహిళలు, చిన్నారులు మృత్యువాతపడుతున్నారు. మంచి నీరు, ఇంధన సరఫరాను సైతం నిలిపివేసింది. డీహైడ్రేషన్, డయేరియా, హెపటైటిస్‌ వంటి వాటితో జనం, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. గాజా ప్రాంతంలోని 90 శాతం నివాసాలను నేలమట్టం చేసి, నిలువ నీడ లేకుండా చేసింది. 

నేలమట్టమైన భవనాల శిథిలాలు, అపరిశుభ్రత మధ్యనే పాలస్తీనియన్లు భయంభయంగా బతుకుతున్నారు. ఐరాస సారథ్యంలో నడుస్తున్న ఆహార పంపిణీ కేంద్రాల నుంచి నిల్వలు హమాస్‌కు దారి మళ్లుతున్నాయని ఆరోపిస్తూ వాటిని ఇజ్రాయెల్‌ మూసివేయించింది. రెండు నెలలుగా అమెరికా, ఇజ్రాయెల్‌ సారథ్యంలో ఆహార పంపిణీ కేంద్రాలు పరిమితంగా ఏర్పాటయ్యాయి. ఇక్కడ సైతం అన్నార్తులు తుపాకీ కాల్పులకు గురికాక తప్పడం లేదు.

 రోజూ పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు. ‘గాజాలో మానవీయ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. తీవ్ర కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. మరికొన్ని రోజులు పరిస్థితులు ఇలాగే కొనసాగితే లక్షలాది మంది ఆకలి చావులకు గురికాక తప్పదు’అని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తోంది. గాజా స్ట్రిప్‌లోని 20 లక్షల మంది ప్రజల ఆకలిని ఆయుధంగా చేసుకోవడం తగదని ఇజ్రాయెల్‌కు హితవు పలుకుతోంది.  

భూమిపై నరకం గాజా
 భూమిపై నరకం కంటే అధ్వానంగా గాజా ప్రాంతం తయారైందని ఇంటర్నేషనల్‌ కమిటీ ఆఫ్‌ ది రెడ్‌ క్రాస్‌ ప్రెసిడెంట్‌ మిర్జానా స్పోల్‌జరిక్‌ వ్యాఖ్యానించారు. గాజాలో యుద్ధాన్ని ఆపేందుకు, పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు, బందీలను వదిలిపెట్టేందుకు ప్రపంచ దేశాలు అవసరమైన ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించారు. అంతర్జాతీయ మానవతా చట్టాలను పట్టించుకోవడం లేదు. పాలస్తీనియన్లకు కనీస మానవీయమైన గౌరవాన్ని కూడా ఇవ్వడం లేదు. గాజాలో చట్టపరమైన, నైతిక, మానవీయ ప్రమాణాల ఉల్లంఘన జరుగుతోందని ఆమె పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement