వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాదిలో తాను భారత్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు గొప్ప స్నేహితుడు అంటూ వ్యాఖ్యానించారు.
ఓవల్ కార్యాలయంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ..‘భారత ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప వ్యక్తి. నాకు మంచి స్నేహితుడు. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల బలోపేతమే మా ఇద్దరి లక్ష్యం. దీనికి సంబంధించిన చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను మోదీ క్రమంగా తగ్గిస్తున్నారు. ఇంధన దిగుమతులపై వాషింగ్టన్, న్యూఢిల్లీ మధ్య సమన్వయం పెరుగుతోంది. రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలపై కఠిన చర్యలకు అనుగుణంగా రష్యా నుండి భారత్ చమురు కొనుగోలును భారీ స్థాయిలో నిలిపివేసింది. వచ్చే ఏడాది భారత్కు వెళ్తాను. మోదీని కలుస్తాను’ అని చెప్పుకొచ్చారు.
వాణిజ్య చర్చలు..
రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్.. రష్యా ముడి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తూ వాషింగ్టన్ ఇటీవల భారత దిగుమతులపై అదనపు సుంకాలను విధించింది. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో ట్రంప్ నిబద్ధతను వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ గతంలో పునరుద్ఘాటించారు, అమెరికాకు భారత్ ‘కీలక భాగస్వామి’ అని పేర్కొన్నారు.


