మరోసారి అమెరికా-ఇరాన్ల మధ్య యుద్ధం భీకర రూపం దాల్చబోతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కాస్త నెమ్మదించిన యుద్ధ మేఘాలు తీవ్ర రూపం దాల్చబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ‘ ఇక ఇరాన్ నాశనం’ అంటూ ప్రకటన.. మరొకవైపు ‘ రండి.. చూస్కుందాం’ అంటూ ఇరాన్ కౌంటర్లతో యుద్ధ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది.
ఈ నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారతీయులకు పలు సూచనలు చేసింది ఇండియన్ ఎంబసీ. ఇరాన్లో ఉన్న భారతీయులెవరూ 48 గంటల పాటు ఎక్కడకు వెళ్లవద్దని, బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. విద్యుత్ ప్లాంట్లలకు చేరువలో గానీ, సైనిక స్థావరాలకు చేరువలో గానీ ఉండొద్దని స్పష్టం చేసింది. భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హోటళ్లలో ఉండేవారు నిరంతరం తమతో టచ్లో ఉండాలని తెలిపింది. అంతా తామిచ్చే అప్డేట్స్ను క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉండాలని స్పష్టం చేసింది.
ఇరాన్ను నామరూపాలు లేకుండా నాశనం చేస్తామని అతిపెద్ద హెచ్చరిక చేసిన నేపథ్యంలో ఇరాన్లోని భారత ఎంబసీ స్పందించింది. ఏ క్షణమైనా యుద్ధా మేఘాలు తీవ్రతరమయ్యే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్తలు అవసరమని తెలిపింది.


