యూదుల చారిటీ అంబులెన్స్లకు నిప్పు
లండన్: బ్రిటన్లోని ఉత్తర లండన్లో సోమవారం తెల్లవారుజామున యూదు వ్యతిరేక దాడితో స్థానికంగా ఒక్కసారిగా కలకలంరేగింది. ‘హ్యాట్జోలా నార్త్వెస్ట్’ అనే లాభాపేక్షలేని యూదుల సేవా సంస్థకు చెందిన ఒకేచోట పార్క్చేసిన నాలుగు అంబులెన్సులను ‘గోల్డన్స్ గ్రీన్’ ప్రాంతంలోని హైఫీల్డ్ రోడ్డులో గుర్తుతెలియని ఆగంతకులు తగలబెట్టారు. సోమవారం మధ్యాహ్నం 1.40 గంటలకు ఈ దాడి ఘటన జరిగింది.
అంబులెన్సుల్లోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ శబ్దాలతో ఆ ప్రాంతాలు దద్దరిల్లాయి. సమీప నివాస భవన అద్దాల కిటికీలు బద్ధలయ్యాయి. విషయం తెల్సి వెంటనే ఉగ్రవ్యతిరేక పోలీస్ విభాగం రంగంలోకి దిగి నిందితుల కోసం వేట మొదలెట్టింది. ‘‘ఘటనతో ముగ్గురికి ప్రమేయం ఉందని భావిస్తున్నాం. త్వరలోనే వాళ్లను పట్టుకుంటాం’’ అని పోలీస్ సూపరింటెండెంట్ సారా జాక్సన్ తెలిపారు. అంబులెన్సులను దహించివేస్తున్న అగ్నికీలలను ఆర్పేందుకు ఆరు అగ్నిమాపక వాహనాలు వచ్చాయి. 40 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పేశారు.


