భూ బేరం! టార్గెట్‌ రూ.5,000 కోట్లు | - | Sakshi
Sakshi News home page

భూ బేరం! టార్గెట్‌ రూ.5,000 కోట్లు

Jun 6 2025 12:03 PM | Updated on Jun 6 2025 12:03 PM

భూ బేరం! టార్గెట్‌ రూ.5,000 కోట్లు

భూ బేరం! టార్గెట్‌ రూ.5,000 కోట్లు

సాక్షి, సిటీబ్యూరో:

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మరోసారి భూ బేరానికి సన్నద్ధమవుతోంది. గతంలో వివిధ ప్రాంతాల్లో విక్రయించగా మిగిలిపోయిన స్థలాలను మరోసారి అమ్మకానికి పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పాత లే అవుట్‌లలో ఉన్న స్థలాలను విక్రయించడంతో పాటు కొత్త లే అవుట్‌లను సైతం సిద్ధం చేస్తున్నారు. నగరంలో చేపట్టనున్న పలు ప్రాజెక్టుల కోసం సుమారు రూ.5,000 కోట్లు ఆర్జించడమే లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌కు ప్రణాళికలను రూపొందిస్తోంది.

గతంలో భారీ స్పందన లభించిన ప్రాంతాల్లో..

● సికింద్రాబాద్‌ నుంచి డెయిరీఫాం వరకు, శామీర్‌పేట్‌ వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌లకు ప్రతిపాదనలు రూపొందించిన సంగతి తెలిసిందే. ప్యారడైజ్‌ నుంచి డెయిరీఫాం వరకు టెండర్లను సైతం కేటాయించారు.శామీర్‌పేట్‌ రూట్‌లో ఆస్తుల సేకరణ తుది దశకు చేరింది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి కనీసం రూ.3000 కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు అంచనా. అలాగే రావిర్యాల నుంచి ఆమన్‌గల్‌ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డుకు సైతం రెండు దశల్లో రూ.2500 కోట్ల వరకు వ్యయం కానుంది.

● హైదరాబాద్‌ మహానగరాభివృద్ధిలో భాగంగా మెగా మాస్టర్‌ప్లాన్‌– 2050, సికింద్రాబాద్‌ స్కైవాక్‌, హుస్సేన్‌సాగర్‌ సుందరీకరణ, పార్కులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారుల విస్తరణ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని భూముల అమ్మకాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో కొనుగోలుదార్ల నుంచి భారీ స్పందన లభించిన ప్రాంతాల్లో మిగిలిపోయిన ప్లాట్‌లను మొదట విక్రయించి ఆ తర్వాత రెండు, మూడు దశల్లో వివిధ ప్రాంతాల్లోని స్థలాలను విక్రయించనున్నారు.

మొదటి దశలో..

కోకాపేట్‌ నియోపొలిస్‌, ఇన్ముల్‌నర్వ, ఉప్పల్‌ భగాయత్‌, తుర్కయంజాల్‌లో గతంలో పెద్ద ఎత్తున స్పందన లభించింది. అప్పటి ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం లభించింది. ఉప్పల్‌ భగాయత్‌లో రెండు దశల్లో ప్లాట్‌లను విక్రయించారు. కోకాపేట్‌లో ఎన్నారైలు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణ సంస్థలు, రియల్టర్లు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. ప్రస్తుతం ఈ నాలుగు ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించిన భూములపై వారికి 60 శాతం ప్లాట్‌లను కేటాయించగా హెచ్‌ఎండీఏకు 40 శాతం ప్లాట్‌లు లభించాయి. వాటిలో మరో 385 ప్లాట్‌లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

రెండు, మూడో దశల్లో..

మొదటి దశలో కొనుగోలుదారులు, వివిధ వర్గాల నుంచి లభించే స్పందన మేరకు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ కొనసాగించనున్నారు. ఈ క్రమంలో బుద్వేల్‌, ప్రతాపసింగారం, బహదూర్‌పల్లి, హకీంపేట్‌, షేక్‌పేట్‌లలోని హుడాహైట్స్‌, కంది, కుత్బుల్లాపూర్‌, పెద్దకంజర్ల, ఫసల్‌వాడి తదితర ప్రాంతాల్లో లే అవుట్‌లను అభివృద్ధి చేసి ప్లాట్‌లను విక్రయించనున్నారు.

దశలవారీగా విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ లే అవుట్‌లు..

ఏరియా మొత్తం హెచ్‌ఎండీఏ విక్రయించినవి ప్రస్తుతం ఉన్నవి

ఎకరాల్లో ప్లాట్లు

లేమూరు 83.47 164 - 164

తొర్రూరు 117.375 885 392 493

కుర్మల్‌గూడ 16.75 145 86 59

బాచుపల్లి 27.36 206 204 2

మేడిపల్లి 53.21 208 91 117 (కొన్ని ప్లాట్లు

కోర్టు కేసుల్లో

ఉన్నాయి.)

మోకిల 165.37 908 189 719 (కొన్ని స్థలాల

రిజిస్ట్రేషన్‌

పెండింగ్‌లో ఉంది.)

బుద్వేల్‌ 182.10 17 12 4

ప్రతాప సింగారం 126.12 24 - 24

బహదూర్‌పల్లి 40.00 221 152 69

హుడా హైట్స్‌ 12.45 37 - 37

కంది 47.14 341 - 341

వివిధ ప్రాంతాల్లో ఆన్‌లైన్‌బిడ్డింగ్‌కు సిద్ధంగా ఉన్న ప్లాట్లు

ఏరియా మొత్తం హెచ్‌ఎండీఏ విక్రయించినవి ప్రస్తుతం ఉన్నవి

ఎకరాల్లో ప్లాట్లు

కోకాపేట్‌ 533.01 20 14 5 (ఒకప్లాట్‌

రంగారెడ్డి కలెక్టరేట్‌కు

తిరిగి ఇచ్చారు)

ఇన్ముల్‌నర్వ 92.69 327 – –

ఉప్పల్‌ భగాయత్‌ 56.39 64 23 41

తుర్కయంజాల్‌ 9.00 34 22 12

మొత్తం హెచ్‌ఎండీఏ ప్లాట్లు : 1141, రైతులకు కేటాయించినవి : 696, ఇప్పటి వరకు విక్రయించినవి : 59, అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి : 385

ఆదాయ సముపార్జనకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు

ఎలివేటెడ్‌ కారిడార్లు, గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు తదితర ప్రాజెక్టుల కోసం..

మొదటి దశలో కోకాపేట్‌, ఇన్ముల్‌నర్వ, ఉప్పల్‌, తుర్కయంజాల్‌ ప్లాట్‌ల బిడ్డింగ్‌

నాలుగు ప్రాంతాల్లో 385 ప్లాట్లు విక్రయానికి సిద్ధం

రెండు, మూడు దశల్లో మరో 10 ప్రాంతాల్లో స్థలాల వేలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement