శ్రీనగర్కాలనీ:తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ప్రజల ఆకాంక్ష అని, కాంగెస్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతి, అభివృద్ధి సాధ్యమని మాజీ ఎంపీ, టీం ఇండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ అన్నారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ... తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు విశ్వసించలేదన్నారు. మైనార్టీలు మెజారిటీ కాంగ్రెస్ వైపు నిలిచారని స్పష్టం చేశారు. ముస్లింలకు అన్ని విధాలా న్యాయం చేసేది కాంగ్రెస్సేనని నమ్మారని, అందుకే తమ మద్దతును ఓట్ల రూపంలో మలిచి కాంగ్రెస్కు విజయాన్ని అందించారని ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గంలో ముస్లింలకు ఇంకా అవకాశం రాలేదని, మైనార్టీల గొంతు వినిపించడానికి ఓ గళం కావాలని అన్నారు.
టిమ్స్ భవన నిర్మాణాలపై హైకోర్టు స్టే
బంజారాహిల్స్: గ్రేటర్ పరిధిలోని అల్వాల్లో 28.41 గుంటల స్థలంలో నిర్మిస్తున్న తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) నిర్మాణ పనులపై హైకోర్టు స్టే విధించిందని నిజాం మునిమనుమడు హిమాయత్ అలీ మీర్జా వెల్లడించారు. ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిజాం కోఠి అసాఫియా ప్యాలెస్కు చెందిన ఈ స్థలం రాష్ట్రపతి నిలయం వెనుకాల ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థలంలో టిమ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. దీన్ని సవాల్ చేస్తూ తాను రిట్పిటిషన్ దాఖలు చేశానని, కంటోన్మెంట్ బోర్డులో ఫిర్యాదు కూడా చేయడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం దక్కాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.