ఓటు వేశాక సెల్ఫీ దిగి వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు | - | Sakshi
Sakshi News home page

ఓటు వేశాక సెల్ఫీ దిగి వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు

Nov 29 2023 4:42 AM | Updated on Nov 29 2023 8:20 AM

- - Sakshi

హైదరాబాద్: గ్రీన్‌ చాలెంజ్‌, బకెట్‌ చాలెంజ్‌ తరహాలోనే ఓటు చాలెంజ్‌కు కాలనీ సంఘాలు తెరలేపాయి. గ్రేటర్‌లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు, యువ ఓటర్లలో చైతన్యం నింపేందుకు యునైటెడ్‌ ఫెడరేషన్‌న్‌ ఆఫ్‌ రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌న్‌ (యూ–ఎఫ్‌ఈఆర్‌డబ్ల్యూఏఎస్‌) పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రౌడ్‌ ఓటరు, ఫ్యామిలీతో సెల్ఫీ..అనే కార్యక్రమాలను చేపడుతున్నట్లు అసోసియేషన్‌ కార్యదర్శి బీటీ శ్రీనివాస్‌ తెలిపారు. కుటుంబంతో కలిసి ఉదయమే ఓటు వేసి, సిరా చుక్కను చూపిస్తూ సెల్ఫీ దిగాలని, ఆయా ఫొటోలను కాలనీ సంఘాల వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేయాలని సూచించారు. కాలనీలో ఇతరులకు ఓటు వేయాలని చాలెంజ్‌ చేయాలని తెలిపారు.

డివిజన్‌్‌ స్థాయిలో వాట్సాప్‌ గ్రూప్‌లు..
నగరంలోని 4,800 కాలనీల్లో పోలింగ్‌ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకొని డివిజన్‌ స్థాయిలో వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్‌లో 800–900 మంది సభ్యులున్నారు. ఈనెల 30న పోలింగ్‌ రోజు ఉదయమే ఓటేశాక కుటుంబ సభ్యులంతా కలిసి వేలిపై సిరా చుక్కను చూపిస్తూ సెల్ఫీ దిగి కాలనీ వాట్సాప్‌ గ్రూప్‌లలో పెట్టాలని అసోసియేషన్‌న్‌ ప్రతినిధులు సూచించారు.

ఆ రోజు ఎలాంటి పనులున్నా వాయిదా వేసుకోవాలని, వేడుకలకు హాజరవ్వాల్సి ఉంటే సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. పోలింగ్‌కు ముందురోజు కాలనీ వాసులంతా సమూహంగా బూత్‌ వరకు ఈవినింగ్‌ వాక్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రధానంగా 40–55 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైన కాలనీల్లో ఈసారి 60 శాతం కంటే ఎక్కువ ఓటింగ్‌ జరగాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement