సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికలు సమీపించిన వేళ...గ్రేటర్లోని వివిధ ప్రాంతాల్లో హెచ్ఎండీఏ పెద్ద ఎత్తున భూమార్పిడికి చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి అభ్యంతరాలను స్వీకరించేందుకు నోటిఫికేషన్లను విడుదల చేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని పలు జిల్లాల్లో భూ మార్పిడి కోసం (చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్) పెద్ద సంఖ్యలో గతంలోనే దరఖాస్తులు వెల్లువెత్తాయి. మాస్టర్ప్లాన్ ప్రకారం చాలాచోట్ల కన్జర్వేటివ్ జోన్లలో ఉన్న భూములను రెసిడెన్షియల్ జోన్లోకి మార్పును కోరుతూ భూ యజమానులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే కొన్ని చోట్ల తయారీ రంగానికి భూములను కేటాయించగా ఇప్పుడు వాటిని నివాసయోగ్యంలోకి మార్పు చేస్తూ హెచ్ఎండీఏ నోటిఫికేషన్లను విడుదల చేసింది. మరోవైపు వాణిజ్య మండలాలుగా ఉన్న వాటిని నివాసంలోకి, రెసిడెన్షియల్ జోన్లలో ఉన్న వాటిని వాణిజ్యమండలాల్లోకి మార్పులు చేర్పులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్లో సవరణలు చేయనున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఖాళీ స్థలాలుగా గుర్తించిన వాటిని సైతం రెసిడెన్షియల్ జోన్లోకి మార్పు చేయడం గమనార్హం. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆగమేఘాల మీద భూమార్పిడి నోటిఫికేషన్లను వెల్లడించారు. అన్ని ప్రాంతాల్లో అభ్యంతరాలను పరిశీలించేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ ఎన్నికల సమయంలో హడావిడిగా నోటిఫికేషన్లు ఇవ్వడం గమనార్హం.
ఎక్కడెక్కడ ఎలా....
బోడుప్పల్లో గతంలో తయారీ రంగం కోసం కేటాయించిన సుమారు 2385 చదరపు మీటర్ల భూమిని ప్రస్తుతం మల్టిపుల్ యూజ్ జోన్లోకి మార్చేందుకు చర్యలు చేపట్టారు. అలాగే శామీర్పేట్ మండలం తుర్కపల్లికి చెందిన 9849.36 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న కన్జర్వేషన్ జోన్ స్థలాలను రెసిడెన్షియల్లోకి మార్చనున్నారు. దాంతో పాటు అదే జోన్లో ఉన్న మరో 9755 చదరపు మీటర్లను కూడా నివాస భూమిగా మార్పు చేసేందుకు నోటిఫికేషన్ వెలువరించారు. కీసర మండలం రాంపల్లిలో కన్జర్వేషన్ జోన్లో ఉన్న మరో 4.6 ఎకరాల భూమిని సైతం రెసిడెన్షియల్కు మార్పు చేయనున్నారు. అలాగే నార్సింగిలో ఉన్న 4584 చదరపు మీటర్ల నివాస స్థలాన్ని వాణిజ్య స్థలంగా మార్పు చేయనున్నారు. కర్మన్ఘాట్లో ఉన్న సుమారు 1441.47 చదరపు మీటర్ల స్థలం ప్రస్తుతం తయారీ రంగానికి చెంది ఉంది. దీనిని నివాస ప్రాంతంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ లో ఉన్న సుమారు 23,850 చదరపు మీటర్లకు పైగా ఉన్న భూమిని మాస్టర్ ప్లాన్లో వినోద అవసరాల కోసం లేదా ఖాళీ ప్రదేశంగా గుర్తించారు. ఇప్పుడు దానిని వాణిజ్య అవసరాల కోసం మార్పు చేయనున్నారు. అలాగే జూబ్లీహిల్స్లో ఉన్న సుమారు 1131.36 చదరపు మీటర్ల నివాస స్థలాన్ని వాణిజ్య స్థలంగా మార్చనున్నారు. ఉప్పల్ మండలం బండ్లగూడ పరిధిలో ఉన్న మరో 16820 చదరపు మీటర్ల ఖాళీ ప్రదేశాన్ని రెసిడెన్షియల్ జోన్గా మార్పు చేయనున్నారు. కాగా ప్రస్తుతం ఎన్నికల సమయంలో హడావిడిగా నోటిఫికేషన్లు ఇచ్చారు. ప్రజల నుంచి అభ్యంతరాలను, ఫిర్యాదులను స్వీకరించకుండానే మార్పు చర్యలు ఎలా చేపడతారని విమర్శలు వస్తున్నాయి.
కన్జర్వేషన్ నుంచి రెసిడెన్షియల్కు మార్పు
అలాగే వాణిజ్యవినియోగ స్థలాలను నివాసంలోకి...
మాస్టర్ ప్లాన్లో ఈ మేరకు మార్పులు
అభ్యంతరాలపై నోటిఫికేషన్లు విడుదల చేసిన హెచ్ఎండీఏ


