మల్లన్న ఆలయంలో శివరాత్రి పూజలు
ఐనవోలు: మండల కేంద్రంలోని శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో రెండోరోజు శనివారం శివరాత్రి ప్రత్యేక పూజలు చేశారు. నిత్య పూజలతోపాటు గవ్యాంత పూజలు, వాస్తుపూజ, పర్యగ్నికరణ, రుద్రహోమం, ప్రాతరౌపాసన బలిహరణ అర్చకులు నిర్వహించారు. లింగోద్భవ కాలంలో స్వామిని అభిషేకించే 108 కలశాలను స్థాపించి శతకలశార్చన, మహాన్యాస పూర్వక రుద్రహోమం కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం మాడవీధుల్లో అశ్వవాహన సేవ, సాయంత్రం శేషవాహన సేవ జరిపారు. మహిళా భక్తులు కోలాటం వేస్తూ, భజనలు చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, ఈఓ కందుల సుధాకర్, ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు శ్రీనివాస్, మధుకర్ శర్మ, వేదపండితులు పాల్లొన్నారు.
బందోబస్తు ఏర్పాట్ల పర్యవేక్షణ
మహా శివరాత్రి సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో పెద్దపట్నం వద్ద తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మామునూరు ఏసీపీ వెంకటేశ్ శనివారం ఆలయంలో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గతంలో జరిగిన పరిణామాలను ఒగ్గు పూజారులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్సై పస్తం శ్రీనివాస్కు సూచించారు.
నేడు శైవ పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హన్మకొండ: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ వైవ పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోందని వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత శనివారం తెలిపారు. ఆదివారం హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి పాలకుర్తి సోమేశ్వర స్వామి దేవాలయానికి, రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో వివరించారు. పాలకుర్తికి ప్రతీ 30 నిమిషాలకు ఒక బస్సు బయలుదేరుతుందన్నారు. ములుగు నుంచి రామప్పకు ప్రతీ 30 నిమిషాలకు ఒక బస్సు నడుస్తుందన్నారు.


