
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను లూటీ చేస్తోంది
● బీఆర్ఎస్ పదేళ్లు తెలంగాణ దోచింది
● బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన
కార్యదర్శి చంద్రశేఖర్ తివారి
మామునూరు: బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుతిన్నదని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను లూటీ చేస్తోందని బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి ఆరోపించారు. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలోని అడిటోరియంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్యక్షతన తొమ్మిది జిల్లాల మండల అధ్యక్షుల శిక్షణ తరగతులు శుక్రవారం రెండో రోజు కొనసాగాయి. ఎమ్మెల్యే అభయ్ పాటిల్ హాజరై రాష్ట్ర ఎన్నికల ప్రభారి తరగతులను ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా చంద్రశేఖర్ తివారి హాజరై మాట్లాడారు. మండల అధ్యక్షులు పార్టీని బలోపేతం దిశగా తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అభయ్ పాటిల్ ఎన్నికల నిర్వహణ, ప్యూహం అనే అంశంపై శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత దుగ్యాల ప్రదీప్కుమార్, డాక్టర్ ప్రకాశ్రెడ్డి, ప్రకాష్బాబు, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, చంద్రశేఖర్ తీవారిలు కార్యాచరణ పద్ధతి, సమావేశాలు, సంభాషణ, సోషల్ మీడియా, స్వశక్తి మండల సంకల్పం అనే అంశాలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎం.ధర్మారావు, విజయ రామారావు, వన్నాల శ్రీరాములు, ఓ.శ్రీనివాస్రెడ్డి, గౌతమ్రావు, క్రాంతికుమార్, కొండేటి శ్రీధర్, కుసుమ సతీష్, రత్నం సతీష్షా, డాక్టర్ వన్నాల వెంకటరమణ, డాక్టర్ విజయచందర్రెడ్డి, మల్లాడి తిరుపతి రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్రెడ్డి, బండి సాంబయ్య యాదవ్, బన్న ప్రభాకర్ పాల్గొన్నారు.
పారదర్శకంగా పదోన్నతులు
● ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలి
● కోఆర్డినేషన్ సమావేశంలో
హనుమకొండ డీఈఓ వాసంతి
విద్యారణ్యపురి: పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలని డీఈఓ వాసంతి ఉపాధ్యాయ సంఘాల బాధ్యులను కోరారు. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కల్పిస్తున్న నేపథ్యంలో శుక్రవారం హనుమకొండ డీఈఓ వాసంతి ఉపాధ్యాయ సంఘాల బాధ్యులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు మాట్లాడుతూ.. ఎస్జీటీల సీనియారిటీ జాబితాలను, వేకెన్సీల జాబితాలను పారదర్శకంగా ప్రకటించాలని డీఈఓను కోరారు. ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అప్పీళ్లను వందశాతం పరిష్కరించి ఏ ఒక్క ఉపాధ్యాయుడికీ నష్టం కలుగకుండా చూడాలని విన్నవించినట్లు సమాచారం. గత పదోన్నతులలో రెండు పదోన్నతులు లభించినా నాన్విల్లింగ్ ఇచ్చినవారిని, అలాగే రివర్షన్ వచ్చిన వారిని ఆయా సబ్జెక్టులలో సీనియారిటీ జాబితాల్లో నుంచి తొలగిస్తామని డీఈఓ వాసంతి ఉపాధ్యాయ సంఘాల బాధ్యులకు తెలియజేశారు. విద్యార్థులకు, టీచర్లకు వందశాతం ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనన్నారు. కాగా, స్కూల్ అసిస్టెంట్ల సత్సమాన క్యాడర్ల హెచ్ఎంల పదోన్నతుల కోసం జిల్లాలో 151 వేకెన్సీలు సంబంధిత డీఈఓ వెబ్సైట్లో ప్రకటించారని సమాచారం. స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్ల గ్రేడ్ 2 పదోన్నతులు కల్పించాక స్కూల్ అసిస్టెంట్ల వేకెన్సీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను లూటీ చేస్తోంది

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను లూటీ చేస్తోంది