
18 కిలోల గంజాయి స్వాధీనం
వరంగల్ చౌరస్తా: వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పద వ్యక్తుల నుంచి 18 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ డివిజన్ ఏఎస్పీ శుభం తెలిపారు. బుధవారం ఇంతేజార్ గంజ్ పోలీస్స్టేషన్లో వారిని ప్రవేశపెట్టి ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు వరంగల్ రైల్వే స్టేషన్ ఏరియాలో పెట్రోల్ చేస్తుండగా రవి టిఫిన్ సెంటర్ ఎదుట ఒక స్త్రీ, ఒక పురుషుడు అనుమానస్పదంగా కనిపించారు. పోలీసులు వారి బ్యాగులను తనిఖీ చేయగా.. సుమారు 18 కిలోల ఎండు గంజాయి నాలుగు బ్యాగుల్లో లభించింది. వివరాలు ఆరా తీయగా.. ఒడిశా రాష్ట్రం గణపతి జిల్లా కట్టంగుమాకు చెందిన జులియం బెహరా(60) జులియం కుమారి బెహర(55) దంపతులని తెలిసింది. వీరు గతంలో కూలి పని చేస్తూ స్వగ్రామంలోనే జీవించేవారు. కూలి గిట్టుబాటు కావడం లేదని, గంజాయి వ్యాపారం చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని నిర్ణయించుకున్నారు. ఒడిశాలోని ఓ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద సుమారు 18 కిలోల ఎండు గంజాయిని తీసుకుని సోలాపూర్ వెళ్లి అక్కడ రూ.50 వేలకు కిలో చొప్పన అమ్మేందుకు నిర్ణయించుకున్నారు. సోలాపూర్ వెళ్లేందుకు జనరల్ బోగిలో టికెట్ లేకుండా ప్రయాణించారు. టీటీ తనిఖీ చేస్తుండగా.. బ్యాగులతో కలిసి ఇద్దరూ టీ తాగేందుకు రైలు దిగారు. ట్రైన్ వెళ్లిపోయాక కోణార్క్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించేందుకు వేచి చూస్తున్నారు. ఈక్రమంలో పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించి తనిఖీ చేయగా.. వారి నుంచి గంజాయి లభించింది. భార్యాభర్తలను అరెస్ట్ చేసి వరంగల్ కోర్టులో హాజరు పర్చినట్లు వరంగల్ ఏఎస్పీ శుభం తెలిపారు. కార్యక్రమంలో సీఐ షుఖూర్, ఎస్ఐలు నీలోజు వెంకటేశ్వర్లు, తేజ, ఏఎస్ఐ భిక్షపతి, సిబ్బంది ఉన్నారు.
స్పెషల్ సీఎస్ను
కలిసిన ఎమ్మెల్యేలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్లో రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుపై బుధవారం హైదరాబాద్ టూరిజం ప్లాజాలోని తెలంగాణ స్పోర్ట్స్, యూత్ సర్వీసెస్ ఆఫీస్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ను ఎమ్మెల్యేలు కలిశారు. స్పోర్ట్స్ స్కూల్ను ప్రారంభించేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన సీఎస్ ఆగస్టు 15న స్పోర్ట్స్ స్కూల్ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. సీఎస్ను కలిసిన ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ ఉన్నారు.

18 కిలోల గంజాయి స్వాధీనం