లక్ష్మీపురం: పారిశ్రామిక కార్మికులకు, స్కీం వర్కర్లకు వేతనాలు పెంచాలని కోరుతూ జూలై 30, 31 తేదీలలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు తెలిపారు. సంఘం జిల్లా కార్యాలయంలో విస్త్తృతస్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 73 రకాల షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వెంటనే వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా పెద్దలకు రాయితీలు ఇస్తూ, పనిచేసే కార్మికులకు మాత్రం వాతలు పెడుతున్నారని ఆరోపించారు. అంగన్వాడీలకు ఇచ్చే రూ.11,500, హెల్పర్లకు రూ.7 వేలు జీతం ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగి అని పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ఆపివేయడం దుర్మార్గం అని అన్నారు. తక్షణమే అంగన్వాడీలకు ఇతర స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, వర్కింగ్ ఉమెన్ జిల్లా కన్వీనర్ జీ రమణ, జిల్లా కార్యదర్శి బి.ముత్యాలరావు, ఏబీఎన్ కుమారి, జిల్లా ఉపాధ్యక్షులు హుస్సేన్ వలి, వై.నేతాజీ, ఎన్.శివాజీ పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు


