ఆర్నెల్లుగా పాఠశాల ముఖం చూడని ఉపాధ్యాయుడు కథనానికి స్పందన
గుంటూరు ఎడ్యుకేషన్: ఆర్నెల్లుగా పాఠశాల ముఖం చూడని ఉపాధ్యాయుడు కథనానికి విద్యాశాఖాధికారులు స్పందించారు. ఉపాధ్యాయుడు విధులకు హాజరు కాకుండా హాజరు నమోదు చేయడంతోపాటు విద్యార్థుల బోధనకు ఆటంకం కలిగించిన పరిస్థితులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడంలో విఫలమయ్యారంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి శనివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. గుంటూరు శివారు గోరంట్లలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎల్ఈ)లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు గతేడాది నవంబర్ నుంచి పాఠశాలకు రావడం లేదు. దీంతో పాఠశాలలో విద్యార్థులకు బోధన చేయడంలో ఇద్దరు టీచర్లకు సాధ్యం కావడం లేదు. ఈ విషయాన్ని వెలుగులోకి తెస్తూ ఈనెల 24న ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి స్పందించిన గుంటూరు తూర్పు ఎంఈవో అబ్దుల్ ఖుద్దూస్ పాఠశాల హెచ్ఎంకు నోటీసు ఇచ్చారు.


