గుంటూరు ఎడ్యుకేషన్: దుగ్గిరాల మండలంలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మార్చి నెల వేతనాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డి.పెదబాబు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ బాజీ, వై.శ్యాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా ఖజానాధికారి ఎం.చంద్రశేఖర్రెడ్డిని కలెక్టరేట్లోని కార్యాలయంలో కలిసిన ఎస్టీయూ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. దుగ్గిరాల సబ్ ట్రెజరీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు ఇప్పటివరకు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేతనానికి సంబంధించిన సమస్యపై సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులు బాధ్యతారాహిత్యంగా సమాధానం చెబుతున్నారని, వారి ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారని తెలియజేశారు. తక్షణమే విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని డీటీవో హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు కె.శ్రీనివాసరావు, జె.గురుబ్రహ్మం, వి.ప్రసాద్, జోజప్ప, కె.వెంకయ్య, యు.మహంకాళరావు, జె.శంకర వరప్రసాద్, సీహెచ్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.


