నెహ్రూనగర్: అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా అందరికి సమాన హక్కులు లభించాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని బృందావన్గార్డెన్స్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం లాడ్జిసెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబటి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంగల భారతదేశం, అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కారణంగా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్నట్లు వెల్లడించారు. అంబేడ్కర్ ఆలోచనా విధానమే మన దేశాన్ని ప్రపంచ దేశాలలోనే ఒక విభిన్న దేశంగా నిలబెట్టిందని కొనియాడారు. కులం, మతం, ప్రాంతాలకతీతంగా భారతీయులందరికీ ఉమ్మడి పవిత్ర గ్రంథాన్ని అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాట అందరికి ఆదర్శనీయమన్నారు. వర్ణ వివక్ష, కుల వివక్షను రూపుమాపేందుకు అంబేడ్కర్ రాజ్యాంగం రూపంలో మన దేశానికి ఒక తారకమంత్రం ఇచ్చారని చెప్పారు. భారతదేశంలో విభిన్న కులాలు, మతాలు, ప్రాంతాలు ఉన్నప్పటికీ వారందరూ కలసిమెలసి సహజీవనం చేయగలుగుతున్నారంటే అందుకు అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే కారణమన్నారు. సమ సమానత్వాన్ని సాధించేందుకు ఎనలేని కృషి చేసిన మహనీయుడిగా అంబేద్కర్ను అందరూ స్మరించుకోవాలని కోరారు. కాని ఈనాడు రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం పాలన కొనసాగడం లేదని..నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ అంబేడ్కర్ చూపిన ఆదర్శ మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ పేద, బడుగు, బలహీనవర్గాలన్నీ కూడా సమానంగా జీవిస్తున్నారంటే అది రాజ్యాంగం పుణ్యమేనని అన్నారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు నిమ్మకాయల రాజనారాయణ, గడ్డేటీ సురేంద్ర, ప్రభు, రాజు, పఠాన్సైదా ఖాన్, ప్రేమ్కుమార్, వినోద్బాబు, పవన్, వెంకటేష్, దూపాటి వంశీ, బూసి రాజలత, ఈచంపాటి వెంకటకృష్ణ(ఆచారి), వెంకాయమ్మ, కోటి, షర్ఫుద్దీన్, సాయికిరణ్, సింగ్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


