మంగళగిరి టౌన్: భద్రత ప్రమాణాలను పాటించని బస్సులను నిలిపివేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి హెచ్చరించారు. మంగళగిరి మండలం కాజా టోల్గేట్ వద్ద బుధవారం రాత్రి వాహనాల తనిఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొంతమంది బస్సు యజమానులు ఇష్టానుసారంగా వాణిజ్య సరుకులను తరలిస్తూ.. అధిక లోడ్తో బస్సులను నడుపుతున్నారని చెప్పారు. భద్రతా నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ విధిగా నిబంధనలను పాటించాలని చెప్పారు. ప్రయాణికుల క్షేమమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యం అని మంత్రి పేర్కొన్నారు.


