గుంటూరు వెస్ట్: గుంటూరు జిల్లాలో ఉద్యోగ నిర్వహణ సంతృప్తినిచ్చిందని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. కలెక్టర్ బదిలీ సందర్భంగా మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, రెవిన్యూ సంఘం ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్కు ఘన సత్కారం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ తనకు అందించిన సహకారానికి అధికారులకు, సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి అందరూ సమన్వయంతో పనిచేసినందునే పలు కార్యక్రమాలు విజయవంతం అయ్యాయన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేసానన్నారు. ఏ అధికారికై నా నిబద్ధతతో పనిచేస్తే సంతృప్తి లభిస్తుందని చెప్పారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో మంచి సమన్వయంతో పాలన సాగించారన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నాయకత్వంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరిగాయని తెలిపారు. పరిపాలనలో పారదర్శకత, ప్రజల సమస్యల పరిష్కారంలో వేగం తీసుకువచ్చినట్లు కొనియాడారు. జిఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు చక్కటి సూచనలు అందజేశారన్నారు. నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే వివిధ కార్యక్రమాలపై దృష్టి సారించారని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి, జడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి, జిఎంసీ డిపిఓ బీవీ నాగసాయి కుమార్, సీపీఓ శేషశ్రీ, జిల్లా అధికారులు కలెక్టర్ సేవలను కొనియాడారు.
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా


