పెదకాకాని: గ్రామానికి చెందిన బెజవాడ సాంబయ్య, విజయలక్ష్మి దంపతులకు నలుగురు కొడుకులు ఉండగా చిన్న కుమారుడు బెజవాడ కృష్ణమూర్తి మాత్రమే సంతానం అని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇచ్చిన మాట వాస్తవమేనని తహసీల్దార్ పి.కృష్ణకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘సాక్షి’ లో మంగళవారం రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యం పేరుతో కథనం ప్రచురితమైంది. ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్(ఎఫ్ఎంబీ) నా హయాంలో ఇవ్వలేదు, గతంలో ఇక్కడ పనిచేసిన పెల్లూరి రత్నం అనే తహసీల్దార్ విచారించి మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆ ఎఫ్ఎంబీ ఆధారంగా బెజవాడ కృష్ణమూర్తి తన తల్లి పేరిట ఉన్న 38 సెంట్ల భూమికి 1బీ, అడంగల్, పాస్ పుస్తకానికి దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. ఆ దరఖాస్తును విచారించి బెజవాడ కృష్ణమూర్తి, మరో ఇద్దరు అని ఉదహరిస్తూ 38 సెంట్లకు హక్కు కల్పించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు.
గురజాల: వీఆర్ఏల డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బదంగి సాహెబ్ డిమాండ్ చేశారు. స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద మంగళవారం వీఆర్ఏలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పే స్కేల్ జీతాలు అమలు చేయాలని, వన్టైమ్ సెటిల్మెంట్ ద్వారా వీఆర్వో, రికార్డు అసిస్టెంట్, అటెండర్, నైట్ వాచ్మెన్ పోస్టులకు భర్తీ చేయాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జీతాలు పెరుగుతాయని, ప్రమోషన్లు వస్తాయని ఆశించామని.. కానీ నేడు ఆ పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ఈ ప్రభుత్వంలో వీఆర్ఏల సమస్యలు గురించి చర్చించిన దాఖలాలు కనిపించలేదన్నారు. రీ సర్వే పేరుతో మమ్ములను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పలు డిమాండ్లను సత్వరమే కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం పరిపాలనాధికారిణికి వినతిపత్రం అందించారు. ఇమాం వలి, ఏడుకొండలు, దేవ సహాయం, రవి, మునాఫ్, పాపారావు, వెంకటేష్, మస్తాన్వలి, ముస్తఫా, రామకృష్ణ, అశోక్, రాజారావు, గురవయ్య, సైదా తదితరులున్నారు.
వీఆర్ఏల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బదంగి సాహెబ్


