వైఎస్సార్ సీపీ గుంటూరు నగర
అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా
మేడికొండూరు : కారు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధానకార్యదర్శి బాజీ కుటుంబానికి అండగా ఉంటామని పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, గుంటూరు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు పఠాన్ సైదా ఖాన్ అన్నారు. ఇస్లాంపేటలోని బాజీ కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమం లో ఫిరంగిపురం మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు జనాబ్ షేక్ మస్తాన్ వలి (నుదురుపాడు మస్తాన్ వలి) జిల్లా మైనారిటీ అధ్యక్షులు షైదా ఖాన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నందెటి రాజేష్, పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జి షర్ఫుద్దీన్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీపీఎస్సీ–2023 బ్యాచ్లో ఎంపీడీఓగా ఎంపికై కొల్లూరు మండలంలో పోస్టింగ్ పొందిన అమర్తలూరి స్పందనకు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మంగళవారం జెడ్పీ క్యాంపు కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు, డెప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, ఏఓ జె.పూర్ణచంద్రారెడ్డి పాల్గొన్నారు.
నెహ్రూనగర్: రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్ డీ పరీక్షలకు ఉచిత శిక్షణ నిమిత్తం అర్హులైన ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.మయూరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రూప్ డీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వంద మంది అభ్యర్థులకు రెండు నెలల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఉచిత శిక్షణకు 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారాంగా ఎంపిక చేయబడుతుందన్నారు. శిక్షణకు దరఖాస్తు చేసుకునే వారు ఏప్రిల్ 8వ తేదీలోగా రాజాగారితోటలోని బీసీ స్టడీ సర్కిల్ గుంటూరు కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు 0863–2358071 నంబర్ను సంప్రదించాలని కోరారు.
గుంటూరు లీగల్: పెదకాకాని పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన హుండీలోని కానుకలు లెక్కింపు సమయంలో కొంత సొమ్ము చోరీకి గురైంది. మల్లేశ్వరస్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామ రఘునందనరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ గౌస్ నిందితురాలైన తాడికొండ మండలం గరికపాడు గ్రామానికి చెందిన ఎడ్ల శ్రీరావమ్మకు మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధించారు. ఈ కేసుకు సకాలంలో సాక్ష్యాధారాలను అందించిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వై.వినోద్కుమార్ కోర్ట్ కానిస్టేబుల్ కే.ప్రేమ్కుమార్కు సంబంధిత అధికారులు అభినందనలు తెలిపారు. కేసు లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి మురళీకష్ణ వాదనలు వినిపించారు.
రెంటచింతల: మండలంలోని పాలువాయిగేటు గ్రామ సమీపంలో ఉన్న టోల్ప్లాజా వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడకక్కడే మృతిచెందాడు. పాతపాలువాయికి చెందిన ఇండ్లచెరువు పుల్లారావు(28) జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మాచర్ల నుంచి రెంటచింతల వైపు వెళ్తున్న వాహనం పుల్లారావును ఢీ కొట్టి ఉంటుందని ఆ ప్రాంతంలో వాహనానికి సంబంధించిన అద్దాలు ఉండటంవలన అనుమానిస్తున్నారు. పుల్లారావు భార్య కోటేశ్వరితో కొంతకాలంగా మనస్పర్థలు ఉన్న నేపథ్యంలో ఆమె కొత్తపల్లి గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఘటన వివరాలు తెలుసుకున్న ఎస్ఐ సీహెచ్ నాగార్జున ప్రమాద స్థలానికి చేరుకుని విచారించారు. భార్య కోటేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.


