ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం
మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన ఇల్లు, కార్యాలయం పరిశీలన మహిళ ఎమ్మెల్యే దాడులు చేయించడం సిగ్గుచేటు
అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్సార్ సీపీ నేతలు
నగరంపాలెం: అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మరచి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలుచేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పార్టీ సీనియర్ నాయకులు మంగళవారం పరామర్శించారు. ఉదయం గుంటూరు సిద్ధార్థనగర్లోని అంబటి ఇంటికి వారు చేరుకున్నారు. మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, నియోజకవర్గాల ఇన్చార్జులు బాల వజ్రబాబు (తాడికొండ), అంబటి మురళీకృష్ణ (పొన్నూరు), దొంతిరెడ్డి వేమారెడ్డి (మంగళగిరి) తదితరులు అంబటి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. టీడీపీ గూండాలు జరిపిన విధ్వంసకాండ గురించి అంబటి కుమార్తెలు మౌనిక, మనోజ్ఞ, అంబటి భార్య విజయలక్ష్మిలు వివరించారు. కార్యాలయంలో అంబటి రాంబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇంట్లో కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లలు ఉన్నారని.. బయట నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కేకలు వేసినా ఏమాత్రం ఆలకించకుండా కోడిగుడ్లు, కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని కన్నీటిపర్యంతమయ్యారు. ఎన్నడూలేని విధంగా భయానకరమైన బీభత్సాన్ని స్పష్టించారని తెలియజేశారు.
అనంతరం మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడుతూ అంబటిని పోలీస్ కస్టడీకి తీసుకుని శారీరకంగా, మానసికంగా మళ్లీ వేదనకు గురి చేసేందుకు పోలీసులు చూస్తున్నారని రాంబాబు కుమార్తె చెబుతున్నారని అన్నారు. మహిళలు ఉంటున్న ఇంట్లోకి ఒక మహిళ ఎమ్మెల్యే వచ్చి దాడులు చేయించడమనేది చాలా దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలన గురించి రాష్ట్రపతికి నివేదించాలని అన్నారు. గవర్నర్ పాలనను రాష్ట్రంలో విధిస్తే గానీ రెడ్బుక్ పాలనకు అంతం ఉండదన్నారు.


