
టెండరింగ్లో సిండి‘కేటులు’
● కూటమి కాంట్రాక్టర్లకు అండగా ఇంజినీరింగ్ అధికారులు ● గత నెల 8న ఓపెన్ చేసిన టెండర్లను సాకులు చూపి క్లోజ్ ● 18న జరగాల్సిన టెండర్ల ఓపెనింగ్ కూడా వాయిదా
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు డూడూ బసవన్నలుగా మారారు. అభివృద్ధి పనుల టెండరింగ్లో కూటమి కాంట్రాక్టర్లు చెప్పినట్లు చేస్తున్నారు. వారి కనుసన్నల్లో ఇంజినీరింగ్ వ్యవస్థ నడుస్తోంది. గత నెల 8న 269 వర్కులు, ఈ నెల 18న రూ.20కోట్లు విలువైన 16 వర్కులకు వివిధ కారణాలు చూపి ఇంజినీరింగ్ అధికారులు టెండర్ ప్రక్రియ నిలిపివేశారు. దీనిపై కొంతమంది కాంట్రాక్టర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఇలాంటి సంస్కృతి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాయిదా పడిన వర్కులకు నేడు టెండర్
నగరపాలక సంస్థ పరిధిలో జరిగే ప్రతి వర్కు తమకే చెందాలని, లేనిపక్షంలో టెండర్లు నిలిపి వేస్తామని ఇటీవల కాంట్రాక్టర్ల అసోసియేషన్ సమావేశంలో కూటమికి చెందిన కాంట్రాక్టర్లు బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. గత నెల 8న కొన్ని పనులకు టెండర్ తెరవాలి.వర్కుల్లో కూటమి నేతలు కాకుండా వేరే వారు ఉన్నారని, ఆపేయాలంటూ కూటమి ప్రజాప్రతినిధులు డ్రాయింగ్ బ్రాంచ్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు.
టెండర్ కాల్ ఫర్ చేసిన కొద్ది రోజుల్లోనే టెండర్ ఓపెన్న్ చేయాలనే నిబంధనల మేరకు డ్రాయింగ్ బ్రాంచ్లో పనిచేసే ఓ అధికారి 20 రోజుల తరువాత తెరిచారు. దీన్ని వ్యతిరేకించిన కొంతమంది బడా కాంట్రాక్టర్లు, అధికారులను అడ్డంపెట్టుకుని టెండర్లన్నింటిని రద్దు చేయించారు. జీఎస్టీ క్లియరెన్స్ లేకుండా ఏ విధంగా ఓపెన్న్చేశావంటూ సదరు అధికారిని మాతృశాఖకు సరెండర్ చేశారు. గత నెల 8న ఆగిపోయిన 269 వర్కులకు ఈ నెల 18న తెరిచేందుకు అధికారులు ఓపెన్ టెండర్ ప్రక్రియ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. దీన్ని కూడా ఆపేశారు. దీనిపై ఇంజినీరింగ్ అధికారులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. సదరు టెండర్లల్లో ఎవరూ పాల్గొనలేదని, అందుకే రెండు రోజులు వాయిదా వేసినట్లు చెబుతున్నారు. 21న తిరిగి నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.
షేరింగ్ కుదిరినట్లే !
నగరపాలక సంస్థలో జరగాల్సిన 269 వర్కులకు షేరింగ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏడు వార్డుల్లో ప్రాధాన్యత కలిగిన 40 నుంచి 50 వర్కులకు కూటమికి చెందిన కాంట్రాక్టర్లే పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రాధాన్యత లేని వర్కులకు మిగిలిన కాంట్రాక్టర్లు వేసే విధంగా ఒప్పందం కుదురుస్తున్నారు. ఓపెన్ టెండర్లో ఎవరూ పాల్గొనకుండా చేస్తున్నారు.
ఉత్సవ విగ్రహంలా అసోసియేషన్
కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఉత్సవ విగ్రహంలా మారింది. కాంట్రాక్టర్లకు అండగా ఉండాల్సిన నేతలు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. డ్రాయింగ్ బ్రాంచ్లో నెలల తరబడి బిల్లులు పెండింగ్లో ఉన్నా పట్టించుకోవడం లేదు. మైనింగ్కు సంబంధించి బిల్స్ ఆగిపోయినా పట్టించుకునే వారు కరువయ్యారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. వర్కులు చేస్తున్నప్పుడు వాటర్ ట్యాంకర్కు రూ.500 వసూలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. కాంట్రాక్టర్ల సమస్యలు పట్టించుకోకుండా వర్కుల షేరింగ్ కోసమే మాట్లాడతారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.