
● భారీగా తప్పిదాలు ● ఒకే పోస్టులో ఇద్దరు, ముగ్గురు నియ
అమరావతి పనుల్లో ప్రమాణాలు పాటించాలి
తాడికొండ: అమరావతి నిర్మాణ పనుల్లో పర్యావరణ, సామాజిక రక్షణ చర్యలు, కార్మికుల ఆరోగ్య భద్రత తదితర అంశాలపై గుత్తేదారులతో శుక్రవారం తుళ్లూరులోని హెచ్ఎస్ఆర్ కల్యాణ మండపంలో సదస్సు నిర్వహించారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎండీ డి. లక్ష్మీ పార్థసారథి మాట్లాడుతూ పనుల్లో నిర్దేశిత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. గుత్తేదారు సంస్థలు తమ కార్యకలాపాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని ఆదేశించారు. బాల కార్మికులు కనిపిస్తే సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. కార్మికుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన భద్రతా పరికరాలు, అంబులెన్స్ను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ప్రపంచ బ్యాంకు బృందంలోని మహిళా ప్రతినిధి జయశర్మ కార్మికులపై లైంగిక దాడి, హింస ఘటనలు జరిగినపుడు పాటించాల్సిన గోప్యత, బాధితులకు అందించాల్సిన సహాయంతో పాటు పలు అంశాలు వివరించారు. అనంతరం గుత్తేదారులతో ప్రతిజ్ఞ చేయించారు. సదస్సులో సీఆర్డీఏ పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో యోగా దినోత్సవం
నెహ్రూనగర్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లాస్థాయి యోగా కార్యక్రమాన్ని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ చల్లా ఓబులేసు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని వార్డ్ సచివాలయ కార్యదర్శులు, జీఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఉదయం 5:30 గంటలకు జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలియజేశారు.
వ్యవసాయ శాఖలో బది‘లీలలు’
కొరిటెపాడు(గుంటూరు): వ్యవసాయ శాఖలో సహాయ సంచాలకుల(ఏడీఏ) బదిలీల్లో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నెల 10వ తేదీ ఉదయం మండల వ్యవసాయ అధికారులతో పాటు, ఏడీఏల బదిలీల ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నడూ లేని విధంగా పైరవీలు జరగడంతో మార్పులు, చేర్పులకు అంతే లేకుండా పోయింది. ఎట్టకేలకు వ్యవసాయ అధికారుల బదిలీల వ్యవహారం కొలిక్కి వచ్చినప్పటికీ.. ఏడీఏల బదిలీల వ్యవహారానికి ముగింపు లభించలేదు. ఏడీఏల బదిలీలను జోనల్ యూనిట్గా తీసుకొని చేపట్టారు. అయితే, ఒక పోస్టులో ఇద్దరు, ముగ్గురిని నియమించడం, జోన్–4కు చెందిన ఏడీఏను జోన్–3కి బదిలీ చేయడం వంటి తప్పిదాలు భారీగా జరిగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 19 మంది ఏడీఏలు బదిలీ అయ్యారు. వీటికి తోడు సిఫారసులు, పైరవీలు కూడా ఊపందుకోవడంతో బదిలీ ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల్లోనే వీటిని హోల్డ్లో పెట్టారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏడీఏలు ఎవ్వరూ రిలీవ్ కావద్దనే ఆదేశాలు వచ్చాయి. అయితే, పది రోజులు గడిచినా రివైజ్డ్ ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో పాత స్థానాల్లో కొనసాగలేక, కొత్త స్థానాల్లో చేరలేక ఏడీఏల పరిస్థితి దయనీయంగా మారింది. పైరవీలు పెద్దఎత్తున జరుగుతుండటంతో బదిలీలపై అనిశ్చితి మరో రెండు, మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 10వ తేదీ నుంచి బ్యాన్ వచ్చింది. ఏడీఏల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడాలంటే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం అవసరం ఉందనే చర్చ వ్యవసాయ శాఖలో కొన సాగుతోంది.
లాసెట్లో సూర్యతేజకు మూడవ ర్యాంకు
నరసరావుపేట: పట్టణానికి చెందిన బత్తుల నరసింహం, సరస్వతి దంపతుల రెండో కుమా రుడు సూర్యతేజ శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ–లాసెట్ ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో మూడో ర్యాంక్ సాధించారు. దివ్యాంగుడైన ఆయన పదో తరగతి, ఇంటర్ ప్రైవేటుగానే పూర్తి చేశారు. ఇంటర్లో 80 శాతం మార్కులు సాధించారు. నేషనల్ లా యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షలకు హాజరై ఒడిశా యూనివర్సిటీలో సీటు పొందారు. 15 ఏళ్ల వయస్సులో వచ్చిన స్పాండిలైట్ వ్యాధితో అనారోగ్యానికి గురై ఆ తర్వాత చికిత్స చేయించుకున్నప్పటికీ అంగవైకల్యం వదలలేదు. జీవితంలో ఓ గొప్ప న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఎదగాలనే ఆకాంక్షను సూర్యతేజ వ్యక్తం చేశారు.

● భారీగా తప్పిదాలు ● ఒకే పోస్టులో ఇద్దరు, ముగ్గురు నియ