
లాం ఫాంలో సలహా మండలి సమావేశం
గుంటూరు రూరల్: కృష్ణ మండలం వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం బుధవారం నిర్వహించారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాంఫాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయ శాఖలు సంయుక్త ఆధ్వర్యం వహించాయి. నగర శివారుల్లోని లాంఫాం నందున్న సమావేశ మందిరంలో రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశానికి పరిశోధన సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మీదేవి మాట్లాడుతూ రైతుల సలహాలు, సూచనలు దృష్టిలో ఉంచుకుని పరిశోధన ప్రణాళికలు తయారు చేయాలని తెలిపారు. నూతన వంగడాలపై ఫీడ్ బ్యాక్ రైతుల నుంచి తీసుకోవాలన్నారు. సహజ వనరుల పొదుపు, నేల ఆరోగ్యం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కృష్ణ మండలంలో నిష్ణాతులైన రైతుల ద్వారా సాగు సమస్యలు, సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. విస్తరణ సంచాలకులు డాక్టర్ జి. శివన్నారాయణ మాట్లాడుతూ జిల్లా వనరులు, అవసరాలు, పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని నూతన పరిశోధనలు జరపాలన్నారు. రైతులు విత్తన రకాలపై కాకుండా పంటల్లో యాజమాన్య పద్ధతులపై దృష్టి సారించాలని కోరారు. వివిధ జిల్లాల వ్యవసాయ అధికారులు ఆయా ప్రాంతాల పంటల స్థితిగతులు, పంటల యాజమాన్యం, మినీ కిట్ల పనితీరు గురించి వివరించారు. వచ్చే ఏడాదిలో చేపట్టాల్సిన పరిశోధనలకు దిశానిర్దేఽశం చేశారు. కేవీకే ఘంటశాల, గరికపాడులతో తయారు చేసిన పలు రకాల ప్రచురణలను విడుదల చేశారు. కార్యక్రమంలో 6 జిల్లాల వ్యవసాయ శాఖల అధికారులు, 12 పరిశోధన స్థానాలు, 6 విస్తరణ యూనిట్లు శాస్త్రవేత్తలు, వివిధ పంటల ప్రధాన శాస్త్రవేత్తలు, డీఆర్సీ అధికారులు, 6 జిల్లాల అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.