ప్రైవేటు శ్రామికుల మీద ఎందుకంత కక్ష? | Sakshi Guest Column On Andhra Pradesh Govt and Private workers | Sakshi
Sakshi News home page

ప్రైవేటు శ్రామికుల మీద ఎందుకంత కక్ష?

Jun 27 2025 1:02 AM | Updated on Jun 27 2025 1:02 AM

Sakshi Guest Column On Andhra Pradesh Govt and Private workers

సందర్భం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రైవే టురంగ శ్రామికుల పని గంటల్ని పెంచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రామికులు రోజుకు గరిష్ఠంగా 8 గంటలు పని చేసేవారు. కొత్త ఆంధ్ర ప్రదేశ్‌లో దాన్ని 9 గంటలకు పెంచారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని 10 గంటలకు పెంచారు. పెట్టుబడుల్ని భారీగా ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో పని గంటల పెంపు కూడా ఒకటని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. 

కార్మిక శక్తి చౌకగా లభిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో పని గంటల్ని కూడా పెంచితే పరిశ్రమలు నెలకొల్పేందుకు కార్పొరేట్‌ సంస్థలు మొగ్గు చూపుతాయని ప్రభుత్వం వాదిస్తోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్, ఎల్‌ అండ్‌ టీ సంస్థల అధినేతలు వారానికి 70 గంటలు, 90 గంటలు పనిచేయాలని కోరు తున్నారు. వాళ్ళ కోరికలకు అనుగుణంగా ఫ్యాక్టరీలు, కార్మిక చట్టాలను మార్చాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తున్నట్టుంది.

ఇక్కడో విచిత్రం ఉంది. 10 గంటల పనిదినం అనేది ప్రైవేటు రంగ శ్రామికులకు మాత్రమే! ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పనివేళలు 10 నుండి 6 గంటల వరకు 8 గంటల పనిదినంగానే కొనసాగు తాయి. ప్రభుత్వమే ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది మధ్య వివక్ష చూపడానికి సిద్ధపడింది. ఈ వివక్ష పని గంటలతో మాత్రమే ఆగడం లేదు. జీత భత్యాల్లోనూ అసాధారణ వ్యత్యాసం రూపంలో ఉంది. ప్రైవేటు శ్రామికుల పని గంటలు పెంచిన ప్రభుత్వం కనీస వేతనాలను పెంచాలనే కనీస ఆలోచన చేయలేదు.

వారానికి ఆరు రోజులు, రోజుకు 8 గంటలు అనే ప్రమాణానికి అనేక చారిత్రక, సామాజిక, శారీరక ధర్మాల కారణాలున్నాయి. యుక్త వయస్సు దాటిన ప్రతి మనిషి మొదటగా, ఆహారం, నిద్ర, మైథునాల వంటి శరీర ధర్మాల్ని పాటించాల్సి ఉంటుంది. ఆ పిదప కుటుంబం, బంధుమిత్రులు, కళాసాహిత్య, రాజకీయ ఆసక్తుల వంటి సామాజిక ధర్మాలను పాటించాల్సి ఉంటుంది. ఆ తరువాత, బతుకు తెరువు కోసం ఓ వృత్తిని ఎంచుకుని పనిచేయాల్సి ఉంటుంది. 

వీటిల్లో ప్రతీదీ ముఖ్యమైనదే కనుక ఒక రోజులో ఉండే 24 గంటల్లో ఈ మూడు ధర్మాలకు సమానంగా చెరో 8 గంటలు కేటాయించాలనే ప్రమాణం ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. అయితే, అత్యాశాపరులుగా మారిన కార్పొరేట్‌ సంస్థల్ని సంతృప్తి పరచడానికి ప్రభుత్వాలు కార్మికుల్ని వేధించడానికి సిద్ధపడు తున్నాయి. ఇదొక అమాన వీయ పరిణామం.

ప్రజల సౌకర్యాలను పెంచడానికి రోడ్లు, నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యా, ఆరోగ్య సదుపాయాలు, అల్పా దాయ వర్గాలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి సంక్షేమ పథకాలు వగైరాలను ప్రభుత్వాలు నిరంతరం అభివృద్ధి చేస్తుండాలి. వీటికయ్యే ఖర్చును కూడా ప్రభు త్వాలు ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేస్తాయి. ఈ వ్యవస్థను నిర్వహించడానికి ఒక కార్య నిర్వాహక వర్గం కూడా కావాలి. 

దానినే మనం సామాన్య భాషలో ‘ప్రభుత్వ ఉద్యోగులు’ అంటున్నాం. అయితే, ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థ నిర్వహణ వ్యయం అనూహ్యంగా పెరిగిపోతున్నది. ఇది ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరుకుందంటే ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల రెవెన్యూ మొత్తాన్ని ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకే ఖర్చుపెట్టేస్తున్నారు.  

ఏపీ ఎన్జీవో సంఘం 20వ మహాసభలు 2017 నవంబరు 4న తిరుపతిలో జరిగాయి. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్పటి ఆర్థిక మంత్రి యన మల రామకృష్ణుడు ఆ వేదిక మీద నుండే ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని చెప్పారు. రాష్ట్ర ప్రభు త్వానికి ప్రజల నుండి పన్నుల రూపంలో వస్తున్న మొత్తం ఆదాయంలో 94 శాతం ప్రభుత్వ ఉద్యోగ జీత భత్యాలు, పెన్షన్లకు సరి పోతున్నదన్నారు.

ఏ ప్రభుత్వం అయినా సరే రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రజల నుండి పన్నుల్ని వసూలు చేస్తుంది. అందులో ఓ నాలుగో వంతు (25 శాతం) నిర్వహణ ఖర్చులకు కేటా యించినా 75 శాతం రాష్ట్ర అభివృద్ధి కోసం వెచ్చించాలి. కానీ అలా జరగడం లేదు. వసూలు చేస్తున్న పన్నుల్లో 94 శాతం ఉద్యోగుల జీత భత్యాల కోసం పోతోంది. దానితో, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం అప్పులు చేయాల్సి వస్తున్నది.

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ తరువాత అమ రావతిలో రాజధాని నిర్మాణం మొదలెట్టినపుడు రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్‌ను వదిలి రావ డానికి సిద్ధపడలేదు. వారి విషయంలో ప్రభుత్వం బుజ్జగింపు ధోరణిని ప్రదర్శించింది. పని దినాల్ని వారా నికి 5 రోజులకు తగ్గించింది. పనివేళల్ని రోజుకు అరగంట తగ్గించింది. వారు రోజూ హైదరాబాద్‌ నుండి వచ్చిపోవడానికి వీలుగా ఒక ప్రత్యేక రైలును కూడా ఏర్పాటు చేశారు. 

12796 నంబరుగల లింగంపల్లి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మంగళగిరి వస్తుంది. 12795 నంబరుగల లింగంపల్లి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ సాయంత్రం 5 గంటల 46 నిమిషాలకు మంగళగిరి రైల్వేస్టేషన్‌లో బయలు దేరు తుంది. మంగళగిరిలో రైలు దిగి 10 గంటల లోపు సచివాలయానికి చేరుకోవడం, అలాగే, ఆఫీసులో 5.30 నిమిషాలకు బయలుదేరి మంగళ గిరిలో ట్రైన్‌ ఎక్కడమూ అసాధ్యం. కనీసం  ఉదయం, సాయంత్రాల్లో అర గంట పని సమయాన్ని తగ్గించా ల్సిందే!

సచివాలయ ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని కలుగ జేసి పదేళ్ళు దాటుతోంది. ఈ సౌకర్యాన్ని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్‌ జూన్‌ 20న కొత్త జీవో ఒకటి జారీ చేశారు. ప్రభుత్వానికి తన ఉద్యోగులంటే ఎందుకింత ప్రేమ, ప్రైవేటు శ్రామికులంటే ఎందుకింత ద్వేషం? ఎవరికయినా రావలసిన సందేహమే!

డానీ
వ్యాసకర్త సమాజ విశ్లేషకులు
మొబైల్‌: 90107 57776 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement