ఇస్లాం వెలుగు
26న ముహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్–ఉన్–నబి సందర్భంగా
ఏడవ శతాబ్దపు అరేబియా ద్వీపకల్పం అనైతికత, అన్యాయం, అజ్ఞానాల చీకట్లలో మగ్గుతున్న కాలమది. బలహీనుడి ఆర్తనాదం అరణ్యరోదనగానే మిగిలి΄ోతున్న రోజుల్లో, ఆడపిల్ల పుట్టడమే మహాపాపంగా భావించి ప్రాణాలతోనే మట్టిలో పాతిపెట్టే కిరాతక సంస్కృతి రాజ్యమేలేది. మానవత్వానికి స్థానం లేని ఆ కఠిన పరిస్థితుల్లో, ముహమ్మద్ ప్రవక్త (స) ఒక దయాసముద్రుడిగా, విమోచకుడిగా లోకానికి పరిచయమయ్యారు. ఆయన రాకతో కేవలం ఒక్రపాంతంలోనే కాక, విశ్వవ్యాప్తంగా నూతన మానవతా శకం ఆరంభమైంది.
సమతాభావం – సామాజిక విప్లవం
ప్రవక్త తెచ్చిన మార్పు కేవలం మతపరమైన సరిహద్దులకు పరిమితం కాలేదు. మానవులందరూ ఒక్కటేనని, దేవుని దృష్టిలో అందరూ సమానులేనని ఆయన చాటారు. రంగు, జాతి, వర్గ భేదాలు మనుషుల శ్రేష్ఠతకు కొలమానాలు కావని, కేవలం నైతికత, పవిత్ర హృదయమే శ్రేష్ఠమైనవని స్పష్టం చేశారు. బానిసలను సొంత సోదరులుగా చూడాలని, వారి విముక్తికి కృషి చేయడమే నిజమైన పుణ్యమని బోధించి సమాజంలో సమతాభావాన్ని నింపారు.
స్త్రీ గౌరవం – ఆర్థిక న్యాయం
స్త్రీల పట్ల ఆయన చూపిన కరుణ సమాజంలో ఒక అపూర్వ విప్లవాన్ని తెచ్చింది. మహిళను భోగవస్తువుగా చూసే కాలంలో ఆమెకు ఆస్తి, వివాహం, గౌరవప్రదమైన జీవిత హక్కులను అందించారు. స్త్రీ స్థానాన్ని అత్యున్నత శిఖరానికి చేర్చారు. మదీనాలో భిన్న మతాలు, తెగల మధ్య ఆయన కుదుర్చుకున్న ఒప్పందం ప్రపంచానికే తొలి సమానత్వ ప్రతిపాదనగా నిలిచింది. బలహీనులను పీల్చి పిప్పిచేసే వడ్డీ వ్యాపారాన్ని నిరసిస్తూ, జకాత్ వంటి దానధర్మాల ద్వారా పేదలకు సంపదలో భాగం కల్పించే సన్మార్గాన్ని చూపారు.
క్షమాగుణం – సార్వజనీన హక్కులు
ఆయన చివరి హజ్ ప్రసంగం మానవ హక్కుల ప్రకటనకు సజీవ సాక్ష్యం. మనుషుల ప్రాణాలు, గౌరవ మర్యాదలు పవిత్రమైనవని, వాటిని భంగపరచే హక్కు ఎవరికీ లేదని చాటిచెప్పారు. హింస కంటే క్షమాగుణమే గొప్పదని తన జీవితం ద్వారా నిరూపించారు. శత్రువులను సైతం ప్రేమానురాగాలతో గెలుచుకోవచ్చనే మధురమైన సత్యాన్ని ఆచరణలో చూపించి, ద్వేషం ఉన్నచోట ప్రేమను నాటారు.
ఆంతరంగిక పరిపక్వత – ఆత్మజ్ఞానం
బాహ్య ప్రపంచంలో సమాజ శ్రేయస్సుకు పునాదులు వేసిన ప్రవక్త బోధనలు, అంతరంగంలో మనిషి తనను తాను తెలుసుకునే ఆత్మజ్ఞాన దిశగా కూడా మార్గం సుగమం చేస్తాయి. మనిషి తన అహంకారాన్ని, స్వార్థాన్ని వీడినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక వికాసం సాధ్యమవుతుందని ఆయన జీవితం చాటిచెప్పింది. బాహ్యంగా ఆడంబర పూజలు చేయడం కంటే హృదయ శుద్ధి కలిగి ఉండటం, ఇతరుల పట్ల దయతో మెలగడమే దైవ సామీ΄్యానికి నిజమైన మార్గమని ఆయన తత్త్వం వెల్లడిస్తుంది. మనోవికారాలను జయించి, ఆత్మనిగ్రహాన్ని సాధించడమే అత్యుత్తమమైన సమరమని బోధించడం ద్వారా మానవ చైతన్యానికి నూతన అర్థాన్ని ఇచ్చారు.
నైతిక సత్యం – నిత్యచైతన్యం
ప్రవక్త ప్రబోధించిన శాంతి కేవలం యుద్ధాలు లేక΄ోవడం మాత్రమే కాదు, అది వ్యక్తి మనస్సు నుండి ప్రారంభమై విశ్వమంతటా విస్తరించే ఒక నిరంతర చైతన్యం. ఏ యుగంలోనైనా నైతికతను కోల్పోయిన నమూనాలు కూలి΄ోక తప్పదని, కేవలం సత్యం, కరుణ ప్రాతిపదికగా నిర్మితమైన సమాజమే శాశ్వతంగా నిలుస్తుందని ఆయన జీవితం స్పష్టం చేస్తుంది. విజ్ఞానం, సాంకేతికత ఎంత పెరిగినా నైతిక పునాదులు లేని నాగరికత వినాశనానికే దారితీస్తుందనే తాత్విక హెచ్చరిక ఆయన సందేశంలో అంతర్లీనంగా ఉంది. ఈ కాలాతీతమైన సత్యాన్ని గ్రహించినప్పుడే మనం అంతర్గత ప్రశాంతతను సాధించగలుగుతాము.
నేటి సమాజం... ఆచరణాత్మక మార్గం
సాంకేతికంగా ఎంతో ఎదిగినా, మానవీయ విలువల లేమితో అశాంతిని ఎదుర్కొంటున్న నేటి ఆధునిక ప్రపంచానికి ప్రవక్త చూపిన దయ, నైతికత, శాంతి మార్గాలు ఎంతగానో అత్యవసరం. మన హృదయాలలో ఆత్మీయతను పెంచుకుని, తోటి మనుషుల పట్ల కరుణ చూపడమే ఆధ్యాత్మికతకు అసలైన పరమార్థం.
మీలాదున్నబీ సందర్భంగా కేవలం సంబరాలకే పరిమితం కాకుండా... ఆయన చూపిన కరుణను, సమతాభావాన్ని, సామాజిక బాధ్యతను మన నిత్య జీవితంలో ఆచరించి చూపడమే ఈ సమాజానికి మనం అందించే అత్యున్నతమైన కానుక. అప్పుడే ప్రవక్త దివ్య సందేశానికి పరిపూర్ణమైన సార్థకత చేకూరుతుంది!
– మదీహా అర్జుమంద్


