National Nutrition Week: ఆరోగ్యానికి 5 చిట్కాలు.. అన్నీ తెలిసినవే!

National Nutrition Week: 5 Simple Ways To Boost Immunity In Telugu - Sakshi

How To Boost Immunity.. 5 Simple Ways
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. కొంత మందికి చిన్నతనం నుంచే రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. మరి కొంతమందికి వయసుతో పాటు జీవన ప్రమాణాల కారణంగా పెంపొందుతుంది. అందుకు పోషకాహారం అవసరమనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏ ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందనే విషయంలో మనలో చాలా మందికి క్లారిటీ లేదు.

ప్రస్తుత కరోనా కల్లోలకాలంలో రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఇప్పటికీ హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు ప్రతీ యేటా సెప్టెంబర్‌ మొదటి వారంలో జరుపుకునే వార్షిక కార్యక్రమమే నేషనల్‌ న్యూట్రిషన్‌ వీక్‌(జాతీయ పోషకాహార వారం). ఈ ఏడాది కార్యక్రమంలో.. 5 సులభతర మార్గాల ద్వారా రోగనిరోధకతను పెంపొందించుకునే పద్ధతులు మీకోసం..

సరిపడినంతగా నీరు 
మనిషి శరీరంలోని ప్రతి జీవాణువు, కణజాలం, అవయవం సమర్థవంతంగా పనిచేయాలంటే  సరిపడినంతగా నీరు తాగాలి. ఆరోగ్యకరమైన జీవనానికి మూల సూత్రమే ఇది. హైడ్రేషన్‌ శరీరం పనితీరును నియంత్రించడంలో, జీవక్రియను సరైన మార్గంలో నడిపించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. నీరు రోగనిరోధకతను పెంచడంలో ఎంతో సహాయపడుతుంది.

 ఆకుపచ్చ కూరగాయలు 
కూరగాయలు, ఆకుకూరలు తినమని పేరెంట్స్‌ ఎందుకు చెబుతారో ఎప్పుడైనా ఆలోచించారా? శరీరానికి అవసరమైన పోషకాలన్నింటినీ సహజసిద్ధంగా అందిస్తాయి కాబట్టే! విటమన్లు, మినరల్స్‌, ఫైబర్‌, ప్రొటీన్లు.. మొదలైనవి అధిక మోతాదులో అందించడమే కాకుండా రోగనిరోధకత పెంపుకు తోడ్పడతాయి.

ప్రొబియోటిక్‌ ఫుడ్‌ 
రోగనిరోధకతను పెంపొందించడంలో కడుపులోని ఆహారనాళం కీలక పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా మన రోగనిరోధకతను పెంచడాని​కి తోడ్పడుతుంది. అందుకే మన రోజువారి ఆహారంలో పెరుగు, మజ్జిగ మొదలైన పాల ఉత్పత్తులు ఉండాలని న్యూట్రిషనిస్ట్స్‌ సూచిస్తుంటారు.

తాజా పండ్లు, పండ్ల రసాలు
పండ్లు, పండ్ల రసాల వల్ల ఆరోగ్యానికి చేకూరే లాభాన్ని కొట్టిపారేయలేము. నేరుగా తిన్నా లేదా జ్యూస్‌ రూపంలో తాగినా ముఖ్యమైన పోషకాలన్నీ సహజమైన మార్గంలో అందిస్తాయి. మన ఆహారంలో వీటి పాత్ర కూడా కీలకమే.

మూలికలు, సుగంధ ద్రవ్యాలు 
రోగనిరోధకతను పెంచడంలో దాల్చినచెక్క, జీలకర్ర, పసుపు.. వంటగదిలో ఉపయోగించే ఇతర సుగంధ ద్రవ్యాల ప్రాధాన్యాన్ని మరచిపోకూడదు. వంటల్లో ప్రత్యేక రుచిని ఇవ్వడమే కాకుండా, యుగాలుగా సంప్రదాయ వైద్య పద్ధతుల్లో కూడా విరివిగా వాడుకలో ఉ‍న్నాయనేది నిపుణులు చెప్పే మాట. కరోనా మహమ్మారి కాలంలో కూడా కషాయం, హెర్బల్‌ టీ, చూర్ణం మొదలైన పద్ధతుల్లో..  వీటిని వినియోగించడం చూశాం. ఈ మూలికలు, సుగంధ ద్రవ్యాల్లో యాంటి ఆక్సిడెంట్స్‌, యాంటి బ్యాక్టీరియాలను బలపరిచే లక్షణాలు పుష్కలంగా ఉండటమే వీటి ప్రత్యేకతకు ప్రధాన కారణమని చెప్పవచ్చు.

చదవండి: గర్భిణులూ.. చక్కెర తగ్గించండి!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top