
నా పేరు జి.సుధీర్. నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను ఒక కార్పొరేట్ విద్యా సంస్థలో గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గత నెల (ఫిబ్రవరి 2025), మా హెడ్ నాకు వేరే బ్రాంచ్కు బదిలీ చేశారు. కానీ నేనూ ఆ రోజు నుండి డ్యూటీ కి వెళ్ళడం లేదు. నా రాజీనామా కూడా ఇవ్వలేదు. నా చివరి జీతం (ఫిబ్రవరి నెల) పొందడానికి, పి.ఎఫ్., గ్రాట్యుటీ సెటిల్మెంట్ కోసం నేను ఏమి చేయాలి? దీనిపై లీగల్గా ప్రోసీడ్ అవ్వాలంటే ఎలా? సలహా ఇవ్వగలరు.
– జి. సుధీర్, హైదరాబాద్.
ప్రైవేటు స్కూలు అయినప్పటికీ గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండ్ పొందడం అనేది మీ హక్కు. ప్రైవేటు స్కూళ్లకు గ్రాట్యుటీ చట్టం వర్తించదు అంటూ పలు స్కూళ్ల యాజమాన్యాలు చేసిన వాదనలను సుప్రీంకోర్టు 2022లో తిరస్కరించింది. కాబట్టి మీరు కూడా గ్రాట్యుటీకి అర్హులు.
అయితే గ్రాట్యుటీ పొందాలి అంటే మీరు కనీసం ఐదు సంవత్సరాలు (లేదా 4 సంవత్సరాల 7 నెలల కన్నా ఎక్కువ) సదరు సంస్థలో పనిచేసే ఉండాలి. అలా పని చేసి ఉంటే మీకు గ్రాట్యుటీ చట్టం నిర్ణయించిన కాల్కులేషన్ (జీతము 15 రోజులు X పనిచేసిన వ్యవధి / 26) ఆధారంగా గ్రాట్యుటీ చెల్లించవలసి ఉంటుంది.
మీరు పనిచేసిన స్కూలు వారికి లిఖితపూర్వకంగా రాజీనామా చేసి, మీకు రావలసిన పి.ఎఫ్., గ్రాట్యుటీ సెటిల్మెంట్ కోసం ఒక దరఖాస్తు కూడా జత చేయండి. వారు పరిష్కరించని పక్షంలో హైదరాబాదులోని గ్రాట్యుటీ కమిషనర్ /లేబర్ కమిషనర్ను సంప్రదించి ఒక దరఖాస్తు సమర్పించవలసి ఉంటుంది. అలాగే పి.ఎఫ్ కూడా ఇవ్వకపోతే, పీ.ఎఫ్. కమిషనర్ వద్ద దరఖాస్తు/ఫిర్యాదు చేయవలసి ఉంటుంది.
మీరు పని చేసిన స్కూలు వారికి నోటీసులు పంపించి వారి పక్షం కూడా విన్న తర్వాత మీకు రావలసిన బకాయిలు చెల్లించవలసినదిగా సదరు కమిషనర్లు ఆదేశాలు జారీ చేస్తారు. రెండు విభాగాల నుంచి కూడా మీకు సరైన ఉపశమనం లభిస్తుంది. న్యాయం జరుగుతుంది. ముందు మీరు స్కూల్కు రాజీనామా లేఖను అందజేయండి.
– శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.)
(చదవండి: పింక్ ట్యాక్స్ అంటే..? ఆఖరికి అందులో కూడా వ్యత్యాసమేనా..!)