ముగిసిన నారసింహుని కల్యాణోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవాలు మంగళవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. భీష్మ ఏకాదశి పర్వదినం మొదలుగా ఆరు రోజులపాటు ఈ ఉత్సవాలను స్మార్త ఆగమ యుక్తంగా, పాంఛాహ్నిక దీక్షతో ఆలయ పండితులు, అర్చకులు కన్నులపండువగా నిర్వహించారు. ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించి తీర్ధప్రసాదాలతో పాటు, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రాత్రి ఆలయంలో శ్రీపుష్ప యాగోత్సవ వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు రాత్రి ఆలయంలో స్వర్ణ శేష వాహనంపై 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదనలు చేశారు. అనంతరం శ్రీపుష్ప యాగోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
ఏలూరు టౌన్: నగరంలో జంతు కళేబరాలు, కొవ్వుతో నూనె తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న పలు ప్రాంతాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. ఏలూరు విజిలెన్స్ సీఐ గంగాభవానీ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు నగరంలో నాలుగు బృందాలుగా విజిలెన్స్ అధికారులు దాడులు చేశారని, ఏలూరు ఆదివారపుపేట మార్కెట్లో, లంకపేట సమీపంలో దాడులు చేసిన 15 లీటర్ల నూనె డబ్బాలు 26 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇద్దరు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ఏలూరు టూటౌన్ పోలీసులకు అప్పగించామని తెలిపారు. అలాగే కామవరపుకోట ప్రాంతం నుంచి ఒక వ్యక్తి ఏలూరు వచ్చి ఈ నూనెను తయారు చేస్తున్నారని, 15 కిలోల నూనె డబ్బా రూ.700లకు విక్రయిస్తున్నారని గుర్తించామన్నారు. ఏలూరు ఫుడ్సేఫ్టీ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నూనెను సబ్బులు, కొవ్వొత్తుల తయారీలోనూ వినియోగిస్తున్నట్లు గుర్తించామనీ, కానీ సరైన ఆధారాలు లభించలేదన్నారు.


