శ్రీవారి క్షేత్రం.. భక్తజన సంద్రం
ద్వారకాతిరుమల: చిన వెంకన్న దివ్య క్షేత్రం శనివారం భక్తజన సంద్రమయ్యింది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, అనివేటి మండపం, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, కల్యాణకట్ట, నిత్యాన్నదాన భవనం ఇలా అన్ని విభాగాలు భక్తులతో పోటెత్తాయి. భక్తుల వాహనాలతో ఘాట్ రోడ్లు నిండిపోయాయి. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.
లింగపాలెం: పంట కాలువలోకి ట్రాక్టర్ దూసుకెళ్లిన ఘటన శనివారం లింగపాలెం శివారులో చోటుచేసుకుంది. ఎస్బీఐ బ్యాంకు సమీపంలోకి ట్రాక్టర్ వెళుతుండగా ఒక్కసారిగా గేదెలు అడ్డు వచ్చేసరికి ట్రాక్టర్ డ్రైవర్ వాటిని తప్పించేందుకు సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
పాలకోడేరు: మండలంలోని వేండ్ర రైల్వే గేటు సమీపంలో సుమారు 32 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వ్యక్తిని రైలు ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు భీమవరం రైల్వే ఎస్సై ఎస్ సుబ్రహ్మణ్యం తెలిపారు. శుక్రవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో కాకినాడ– లింగంపల్లి ప్రత్యేక రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. వివరాలు తెలిసిన వారు భీమవరం రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.
శ్రీవారి క్షేత్రం.. భక్తజన సంద్రం


