గేదెల కోసం చెరువులోకి దిగి..
ద్వారకాతిరుమల : గేదెల కోసం చెరువులోకి దిగిన ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మారంపల్లి గ్రామంలోని చంద్రవంక చెరువులో చోటుచేసుకుంది. మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది శనివారం చెరువులోంచి వెలికితీశారు. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల మండలం, ఘంటావారిగూడెం గ్రామానికి చెందిన దొబ్బిడి వెంకట సుబ్బారావు (60) శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లి గేదెలకు గడ్డి వేశాడు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసిన తరువాత, మళ్లీ పొలానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి రాకపోయే సరికి ఆయన కుమారుడు గంగాధరరావు పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో సాయంత్రం పొలానికి వెళ్లి చుట్టుపక్కల వెతికాడు. చంద్రవంక చెరువు గట్టుపై వెంకట సుబ్బారావు సెల్ఫోన్, పొగాకు కవరు, అలాగే చెరువులో గేదెలు ఉన్నట్టు గుర్తించాడు. దాంతో తన తండ్రి గేదెల కోసం చెరువులోకి దిగి, గల్లంతైనట్టు తెలుసుకున్నాడు. కాగా హెడ్ కానిస్టేబుల్ కె.శ్రీనివాసరావు సమక్షంలో శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని వెలికితీశారు. గంగాధరరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్సీ శ్రీనివాసరావు తెలిపారు.


