లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిని శిక్షించాల
కుక్కునూరు: ఇబ్రహీంపేట స్కూల్లో స్వీపర్పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సీఐటీయూ మండల కన్వీనర్ యర్నం సాయికిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఎంఈఓ, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ మండలంలోని ఇబ్రహీంపేట ప్రాథమిక పాఠశాలలో గత పదేళ్లుగా స్కూల్ స్వీపర్గా పనిచేస్తున్న కాకర్ల వెంకటేశ్వరమ్మను అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కొద్ది రోజుల నుంచి అసభ్యకరంగా తిడుతూ, లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయం కలెక్టర్కి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఉద్యోగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, స్కూల్ స్వీపర్ను, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి, ఉద్యోగం నుంచి తొలగించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని సాయికిరణ్ హెచ్చరించారు. ధర్నా కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షుడు కాక ఆనంద్, బాధితురాలు కాకర్ల వెంకటేశ్వరమ్మ, నాయకులు కారం నాగలక్ష్మి, కాక కమలమ్మ, సీత, పాపమ్మ, సీతమ్మ, కృష్ణవేణి, చంద్రమ్మ, పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.


