మళ్లీ రిజిస్ట్రేషన్ల బాదుడు
ధరలు పెంచినా తగ్గిన ఆదాయం
ఆదాయం పూర్తిగా తగ్గింది
రియల్ ఎస్టేట్ నాశనమైంది
ఏలూరు (ఆర్ఆర్పేట): చంద్రబాబు ప్రభుత్వం మరోసారి రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా పెంచి జనం నెత్తిన భారం మోపడానికి సిద్ధమైంది. దీంతో జిల్లాలో భూముల కొనుగోలు కలగా మిగిలే పరిస్థితిలా తయారైంది. కేవలం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే భూముల ధరలు పెరుగుతాయని ప్రభుత్వం చెబుతున్నా పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం కారణంగా మొత్తం జిల్లాలోని మారుమూల పల్లెల్లో కూడా ధరలు పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం మార్కెట్ విలువ సవరణకు రిజిస్ట్రేషన్ శాఖకు అనుమతులు ఇచ్చారు. గతేడాది ప్రాంతాన్ని బట్టి 0 నుంచి 25 శాతం భూముల ధరలను పెంచిన ప్రభుత్వం.. వరుసగా రెండో ఏడాది భూముల విలువలు పెంచడానికి తీసుకున్న నిర్ణయం అశనిపాతంలా మారింది. రెండో ఏడాదీ భూముల విలువను 0 నుంచి 25 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల భూముల ధరల్లో మొత్తంగా 50 శాతం పెరుగుదల ఉంటుంది. భూముల మార్కెట్ విలువల పెంపు నిర్ణయాన్ని ఫిబ్రవరి 1 నుంచే అమలు చేస్తున్నారు. ఈ మేరకు భీమడోలు రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో 0 నుంచి 20 శాతం, చింతలపూడి రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో 10 నుంచి 25 శాతం, జంగారెడ్డిగూడెం పరిధిలో 10 నుంచి 17 శాతం భూముల ధరలు పెరుగనున్నాయి. కామవరపుకోట పరిధిలో 5 నుంచి 25 శాతం, పోలవరం కార్యాలయం పరిధిలో 0 నుంచి 20 శాతం, ఏలూరు కార్యాలయం పరిధిలో 5 నుంచి 10 శాతం, గణపవరం కార్యాలయం పరిధిలో 0 నుంచి 25 శాతం పెరుగనున్నాయి. వీటితో పాటు వట్లూరు కార్యాలయం పరిధిలో 10 నుంచి 20 శాతం, కై కలూరు కార్యాలయం పరిధిలో 17 నుంచి 20 శాతం, మండవల్లి కార్యాలయం పరిధిలో 7 నుంచి 25 శాతం, ముదినేపల్లి కార్యాలయం పరిధిలో 5 నుంచి 20 శాతం, నూజివీడు కార్యాలయం పరిధిలో 0 నుంచి 15 శాతం భూముల ధరలు పెరుగనున్నాయి.
జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 5 కార్యాలయాల్లో దస్తావేజుల సంఖ్య కూడా పడిపోయింది. ఏలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే 5,070 దస్తావేజులు తక్కువగా రిజిస్ట్రేషన్ చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో 15,912 దస్తావేజుల రిజిస్ట్రేషన్ జరగ్గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 10,842 మాత్రమే జరిగాయి. చింతలపూడి కార్యాలయంలో 361, గణపవరం రిజిస్ట్రార్ కార్యాలయంలో 46, కై కలూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో 20 ముదినేపల్లి రిజిస్ట్రార్కార్యాలయంలో 9 దస్తావేజుల రిజిస్ట్రేషన్ తగ్గాయి.
గతేడాది భూముల విలువలను పెంచినా ఆదాయం పెరగలేదు. భూముల ధరలు పెంచడంతో వాటి కొనుగోలుకు ప్రజలు నిరాసక్తత చూపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో రెండు నెలలు మిగిలి ఉండగా ఇంతవరకూ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు రూ.5 కోట్లు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా 75,660 దస్తావేజులు రిజిస్ట్రేషన్ జరగ్గా వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.297.84 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకూ ఈ 12 కార్యాలయాల్లో 74,057 దస్తావేజులు రిజిస్ట్రేషన్ జరగ్గా.. రూ. 292.94 కోట్ల ఆదాయం వచ్చింది. వాస్తవానికి భూముల ధరలు పెంచితే రిజిస్ట్రేషన్ల ద్వారా ఎక్కువ ఆదాయం రావాలి.
గత 25 ఏళ్ళుగా దస్తావేజుల లేఖరిగా పని చేస్తున్నాను. గతంలో ఎప్పుడు భూముల ధరలు పెరిగినా ఆదిలో కొంత రిజిస్ట్రేషన్లు తగ్గినా తరువాత పుంజుకునేవి. గత ఏడాదిలో పెంచిన భూముల ధరల కారణంగా రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గిపోయాయి. దీంతో మాకు వచ్చే ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోయింది. కుటుంబ పోషణకు కూడా ఆదాయం రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
– వీ చంద్రశేఖర ఫణి కుమార్, దస్తావేజుల లేఖరి
ప్రభుత్వం గతేడాది భూముల ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం కారణంగా ఇళ్ళ స్థలాలు, పొలాలు కొనుగోలు చేసే నాథుడే కరువయ్యాడు. గత ఏడాది రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా నాశనమైంది. ఈ ఏడాది కూడా ధరలు పెంచాలని తీసుకున్న నిర్ణయంతో అసలు భూముల కొనుగోలుపై ఆలోచన కూడా చేసే పరిస్థితి కనిపించడం లేదు.
– గంటా రాజేశ్వరరావు, రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి
మరోసారి మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం
25 శాతం వరకూ భూముల విలువ పెంచేందుకు నిర్ణయం
ఫిబ్రవరి 1 నుంచే అమలు
గతేడాది రూ. 5 కోట్లు తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
మళ్లీ రిజిస్ట్రేషన్ల బాదుడు
మళ్లీ రిజిస్ట్రేషన్ల బాదుడు


