మొక్కజొన్న పంట పరిశీలించిన అధికారులు
కొయ్యలగూడెం: మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన రైతులకు సంబంధిత కంపెనీ వెంటనే తగిన నష్టపరిహారం అందజేయాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏడీఏ పి.బుజ్జిబాబు పేర్కొన్నారు. సాక్షి దినపత్రికలో బుధవారం ప్రచురితమైన శ్రీకల్తీ విత్తనాలతో నష్టం్ఙ కథనానికి స్పందించిన వ్యవసాయ శాఖ అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు రైతులను పరామర్శించారు. పొంగుటూరు, కన్నాయగూడెం, గవరవరం గ్రామాల రైతులతో నష్టం అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీడ్ని అందజేసిన కంపెనీ ప్రతినిధులను రప్పించి జరిగిన నష్టానికి బాధ్యత వహించాల్సిందిగా సూచించారు. ఈ నేపథ్యంలో రైతు ప్రతినిధులు కంపెనీ ప్రతినిధులు ఒప్పందానికి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని బుధవారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో లెక్కించారు. 20 రోజులకు నగదు రూపేణా రూ. 2,24,23,765 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 174 గ్రాముల బంగారం, 3.594 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు.
నూజివీడు: ట్రిపుల్ఐటీలో క్వాంటం కంప్యూటింగ్పై నిర్వహిస్తున్న ఐదురోజుల వర్క్షాపులో భాగంగా బుధవారం క్వాంటం భౌతిక శాస్త్రం, క్వాంటం ఆల్గోరిథం, క్వాంటం కమ్యూనికేషన్కు సంబంధించిన కీలక అంశాలపై అవగాహన కల్పించారు. రెండో రోజు సాంకేతిక సెషన్ను ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ మాజీ డైరెక్టర్ ఆచార్య జీ భగవన్నారాయణ నిర్వహించారు. భౌతిక శాస్త్ర అధ్యాపకుడు, వర్క్షాప్ కన్వీనర్ దుర్గాబాబు క్వాంటం ఆప్టిక్స్పై ఉపన్యాసం ఇచ్చారు. కాంతి క్వాంటం స్వభావం, ఆధునిక క్వాంటం సాంకేతికతల్లో ప్రాముఖ్యతను వివరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉడతా పావని క్వాంటం ఆల్గోరిథంపై సాంకేతిక సెషన్ నిర్వహించి, సంప్రదాయ ఆల్గోరిథంలతో పోలిస్తే క్వాంటం ఆల్గోరిథంకు ఉన్న తేడాను వివరించారు.
ఏలూరు(మెట్రో): రాష్ట్రంలో ఉగాది నాటికి 5 లక్షల నిరుపేదలకు ఇళ్ళు అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం జిల్లాలో పేదల గృహ నిర్మాణాల లక్ష్యాలపై గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యాల సాధనకు అనుగుణంగా సిబ్బంది పనిచేసి లక్ష్యాలు సాధించాలన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రగతిపై ప్రతి వారం సమీక్షిస్తానని, నిర్లక్ష్యం వహించే అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు.
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థలోని ఉద్యోగాల దరఖాస్తు తేదీ పొడిగించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలియజేసారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థలోని డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లుగా తెలిపారు. అభ్యర్థులు 30వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు న్యాయ సేవాధికార కార్యాలయం చేరేలా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మొక్కజొన్న పంట పరిశీలించిన అధికారులు
మొక్కజొన్న పంట పరిశీలించిన అధికారులు


