
పీజీఆర్ఎస్కు వెల్లువెత్తిన అర్జీలు
ఏలూరు(మెట్రో) : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలకు నిర్దేశిత సమయంలోపు నాణ్యమైన పరిష్కారం చూపాలని జేసీ పి.ధాత్రిరెడ్డి ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 376 అర్జీలు అందుకున్నారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, జెడ్పీ సీఈఓ శ్రీహరి, డీఆర్డీఏ పీడీ అర్.విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె.భాస్కర్, దేవకిదేవి పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన రాచర్ల విజయకుమారి తనకు కువైట్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి రూ.2.50 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు.
● ఏలూరు పడమరవీధికి చెందిన కొలపల్లి జయరామచందు తన ఇంటి సమీపంలో పిచ్చిమొక్కలతో పాములకు ఆవాసంగా మారిందని చర్యలు తీసుకోవాలని అర్జీ అందించారు.
● దెందులూరు మండలం కొవ్వలికి చెందిన గొరిపర్తి కొండలరావు తనకు శాశ్వత సదరం సర్టిఫికెట్ జారీ చేసి సామాజిక పింఛన్ ఇప్పించాలని కోరారు.
● పెదవేగికి చెందిన తొంటా తాతయ్య పెదవేగి హైస్కూల్లో విద్యార్థులకు మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాలని వినతిపత్రం సమర్పించారు.
● పెదవేగికి చెందిన బొల్లికొండ శ్రీనివాసరావు పెదవేగి పీహెచ్సీ ఆవరణలో సుమారు 60 సెంట్ల భూమి ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేశారు.
● ఉంగుటూరు మండలం ఎర్రమిల్లిపాడుకి చెందిన చిలుకూరి సాయిబాబు తనకు గున్నంపల్లిలో ఉన్న భూములను ఆన్లైన్ చేయాలని వినతిపత్రం అందించారు.
● లింగపాలెం మండలం ధర్మాజీగూడెంకు చెందిన గారపాటి వెంకట సుబ్బారావు తాను పక్షవాతంతో బాధపడుతున్నానని, సదరం సర్టిఫికెట్ జారీ చేసి దీర్ఘకాలిక రోగులకు ఇచ్చే పెన్షన్ మంజూరు చేయాలని అర్జీ అందించారు.
● పెదవేగి మండలం కూచింపూడికి చెందిన నిట్టా కృష్ణ తన తండ్రి వైమానికదళంలో పనిచేసిన సమయంలో 5 ఎకరాలు ప్రభుత్వం మంజూరు చేసిందని, సదరు పొలాన్ని సర్వే చేసి ఆన్లైన్ చేయాలని కోరారు.