
పేదల స్థలాల్లో పోలీస్స్టేషన్ నిర్మాణమా?
ఏలూరు (ఆర్ఆర్పేట): మండవల్లి శివారు తరుగుమూల లేఅవుట్లో పేదలకు ఇచ్చిన ఇందిరమ్మ కాలనీ స్థలాల్లోని కామన్ సైట్ను పోలీస్స్టేషన్ నిర్మాణానికి కేటాయించడం దారుణమని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం కాలనీవాసులు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ 2006లో 131 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారని గుర్తు చేశారు. అయితే అప్పటినుంచి ఇళ్ల స్థలాలను మెరక చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇక్కడే 40 సెంట్లు కామన్ సైట్గా ఇచ్చారని, ఇప్పుడు ఈ కామన్సైట్లో పోలీస్స్టేషన్ నిర్మించేందుకు పంచాయతీ తీర్మానం చేసిందని, ప్రభుత్వ అధికారులు అనుమతులు కూడా ఇవ్వడం దారుణమని మండిపడ్డారు.
జేసీ అసహనం
తమకు న్యాయం చేయాలంటూ పీజీఆర్ఎస్లో కాలనీవాసులు వినతిపత్రం అందజేయగా.. పోలీస్స్టేషన్ నిర్మాణం చేయవద్దు అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అని లబ్ధిదారులపై జేసీ ధాత్రిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు పట్టాలు ఉంటే చూపించండి, అర్హులైతే మరో చోట స్థలాలు కేటాయిస్తారు అని అనడంపై లబ్ధిదారులు అవాక్కయ్యారు. న్యాయం చేయాల్సిన ఉన్నతాధికారులు ఇలా మాట్లాడితే తమ సమస్యను ఇంకెవరికి చెప్పుకోవాలంటూ ప్రశ్నించారు.