
నారాయణపురం వంతెనకు భారీ రంధ్రం
ఉంగుటూరు: ప్రజలు అనుకున్నదంతా జరిగింది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో వంతెన శ్లాబ్ ఊడి పెద్ద రంధ్రం పడింది. ఆదివారం వేకువజామున మండలంలోని నారాయణపురం బ్రిడ్జిపై మీటరున్నర పొడవు, మీటరు వెడల్పున శ్లాబ్ ఊడి పెద్ద రంధ్రం పడింది. ఆ సమయంలో వాహన రాకపోకలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. బ్రిడ్జిపై ద్విచక్రవాహనాలు మినహా మరి ఏ ఇతర వాహనాలు తిరగకుండా పోలీసులు, ఆర్అండ్బీ సిబ్బంది ఆంక్షలు విధించి పహారా కాస్తున్నారు. గణపవరం సీఐ సు భాష్, చేబ్రోలు, నిడమర్రు ఎస్సైలు సూర్యభగవాన్, ప్రసాద్ ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆర్అండ్బీ ఏఈ భాస్కరరావు ఈ ప్రదేశాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించారు. ఉన్నతాధికారులు ఎవరూ ఇప్పటివరకూ ఇక్కడకు రాలేదు.
భారీ వాహనాల రాకపోకలతోనే..
1932లో నారాయణపురం బ్రిడ్జిని నిర్మించగా దాదాపు 12 ఏళ్ల నుంచి శిథిలావస్థకు చేరుకుంది. ఇటుగా 30 టన్నుల వరకు భారీ వాహనాలు ఎక్కువగా తిరగడమే బ్రిడ్జికి రంధ్రం పడటానికి కారణంగా కనిపిస్తుంది. నిత్యం వందలాదిగా చేపలు, రొయ్యలు, కంకర లారీలు ఇటుగా తిరుగుతు న్నాయి. కొన్నేళ్లుగా బ్రిడ్జి కింద భాగం పెచ్చులూడటంతో వంతెన పునర్నిర్మించాలని స్థానికులు ప్రజాప్రతినిధులకు విన్నవించారు.
తప్పని దూరాభారం
పశ్చిమ డెల్టాతో పాటు కోనసీమ జిల్లా నుంచి విజయవాడ, హైదరాబాద్కు ఇటుగా దగ్గర మార్గం కావడంతో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అలాగే ఆక్వా ఉత్పత్తుల లోడు లారీలు ఇటుగా కోల్కతా, ఈశాన్య రాష్ట్రాలకు వెళుతుంటాయి. ఇప్పుడు ఇటుగా రాకపోకలు నిలిపివేయడంతో కొన్ని వాహనాలు చేబ్రోలు బ్రిడ్జి నుంచి పుంత దారి మీదుగా గణపవరం చేరుకుంటున్నాయి. ఎక్కువ వాహనాలు తాడేపల్లిగూడెం మీదుగా సుమారు 50 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించి వెళుతున్నాయి.
గత ప్రభుత్వంలో బ్రిడ్జి మంజూరు
తాము అధికారంలో ఉండగా అప్పటి సీఎం జగన్కు చెప్పి ఉంగుటూరు నియోజకవర్గంలో మూడు బ్రిడ్జిలు మంజూ రు చేయించాను. అందులో నారాయణపురం బ్రిడ్జి ప్రధానమైంది. రూ.8.50 కోట్ల నిధులు మంజూరు చేయించగా ప్రభుత్వ అధికారుల తాత్సారం, టెండర్ల దశలో ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రభు త్వం మారడంతో ఆ పని పెండింగ్లో పడింది. బ్రిడ్జికి రంధ్రం పడటం దురదృష్టకరం. వంతెన పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి.
– పుప్పాల వాసుబాబు,
మాజీ ఎమ్మెల్యే, ఉంగుటూరు
శ్లాబ్ ఊడి పడిన వైనం
స్తంభించిన రాకపోకలు
గత ప్రభుత్వంలో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు
కూటమి పాలనలో పట్టించుకోని వైనం
గత ప్రభుత్వంలో రూ.8.50 కోట్ల మంజూరు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గణపవరం పర్యటనకు వచ్చిన సందర్భంగా అప్పటి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నియోజకవర్గ సమస్యలను విన్నవించారు. దీంతో 2023లో గుండుగొలను, నారాయణపురం, గణపవరంలో వంతెనల నిర్మాణాలకు మాజీ సీఎం జగన్ నిధులు మంజూరు చేశారు. నారాయణపురం బ్రిడ్జికి రూ.8.50 కోట్లు, గుండుగొలను బ్రిడ్జికి రూ.9 కోట్లు, గణపవరం బ్రిడ్జికి రూ.8.45 కోట్ల నిధులు మంజూరు చేశారు. గుండుగొలనులో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే నారాయణపురం బ్రిడ్జి పనులు టెండర్ల ప్రక్రియ దశకు చేరే సరికి సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పనులు నిలిచిపోయాయి. గతేడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పనులను పట్టించుకోలేదు. దీంతో బ్రిడ్జి నిర్మాణం ప్రశ్నార్థకమైంది.

నారాయణపురం వంతెనకు భారీ రంధ్రం

నారాయణపురం వంతెనకు భారీ రంధ్రం