
మున్సిపల్ కార్మికులకు అన్యాయం
ఏలూరు (ఆర్ఆర్పేట): మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాల చెల్లింపులో జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సరిచేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ఆదివారం ఏలూరులో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ నగర కమిటీ ఆధ్వర్యంలో సీఐటీయూ కార్యాలయంలో ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు 12 వేల మంది మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు జీతాల వ్యత్యాసాల వల్ల వందల కోట్ల రూపాయలు నష్టపోతున్నారన్నారు. మున్సిప ల్ కార్మికుల రాష్ట్రవ్యాప్త సమ్మెకు సీఐటీయూ అనుబంధ సంఘాలన్నీ మద్దతుగా పాల్గొంటున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్రావు, మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు అప్పలరాజు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడుతూ జీతాల్లో వ్యత్యాసం వల్ల ఒక్కో కార్మికుడు ఆరేళ్లలో రూ.4.50 లక్షలకు పైగా నష్టపోయారన్నారు. పలు సంఘాల నాయకులు వైఎస్ కనకారావు, జె.గోపి, అంగుళూరు జానుబాబు, వినుకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఏలూరులో పీజీఆర్ఎస్
ఏలూరు(మెట్రో): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని జిల్లాస్థాయిలో సోమవారం ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించనున్నట్టు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తెలిపారు. కొల్లేరుకు సంబంధించి కేంద్ర సాధికారత కమిటీ పర్యటన దృష్ట్యా కలెక్టర్ సంబంధిత ప్రాంతాల్లో పర్యటిస్తారని, పీజీఆర్ఎస్కు జాయింట్ కలెక్టర్ హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే సమస్యలపై ఆన్లైన్లో ఫిర్యా దు చేయవచ్చని, 1100 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేయవచ్చని తెలిపారు.
కొల్లేరు ప్రజల జీవనాన్ని కాపాడాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపాలని, కొల్లేరులో పక్షులు, పర్యావరణాన్ని మాత్రమే కాకుండా అక్కడి ప్రజల జీవితాలను, జీవనాన్ని కాపాడాలని ఈనెల 17,18 తేదీల్లో పర్యటించే కేంద్ర సాధికారత కమిటీని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. కొల్లేరును నమ్ముకుని వందలాది ఏళ్లుగా బతుకుతున్న సుమారు మూడు లక్షల మంది ప్రజల జీవనం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కొల్లేరును 3వ కాంటూరుకు కుదించడం, ఎకో సెన్సిటివ్ జోన్ నుంచి మినహాయించడం, వా రికి ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా మాత్రమే ప్రజల జీవితాలను నిలబెట్టగలమని తెలిపారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. జిరాయితీ డీ పట్టాల భూములను రైతులకు కేటాయించాలన్నారు. అటవీ నిబంధనలు సడలించి తాగునీరు, రోడ్లు, శ్శశాన వాటికలు, మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలు, జీవన భద్రతపై నిర్ణయం తీసుకునేలా కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు.
ఉత్కర్ష అభియాన్తో గిరిజనుల అభివృద్ధి
ఏలూరు(మెట్రో): దార్తీ అభ జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ పథకం జిల్లాలో గిరిజనుల అభివృద్ధికి దోహదపడుతుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. ఆదివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పథకం అమలుపై అధికారులతో సమీక్షించారు. గిరిజన పథకాలను అర్హు లు వినియోగించుకునేలా చూడాలన్నారు. పథకాలు, గిరిజనుల హక్కులపై అవగాహన కలిగించేందుకు ఈనెల 16 నుంచి 30 వరకు గిరిజన గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని 132 గిరిజన గ్రామాల్లో గిరిజనుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తహసీల్దార్లు, ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఐటీడీఏ పీఓ రాములు నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్మికులకు అన్యాయం