
వృద్ధులకు బాసటగా నిలవాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): వృద్ధులకు ప్రతిఒక్కరూ బాసటగా నిలవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ సూచించారు. ఆదివారం ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో వృద్ధుల హక్కులు, చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ వృద్ధులపై వేధింపులు, నిర్లక్ష్యం, దుర్వినియోగం వంటి సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలను సూచించడానికి ఈ దినోత్సవం వేదికన్నారు. పిల్లలు వారి తల్లిదండ్రులకు రక్షణ, పోషణ, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వృద్ధుల సమస్యలను పరిష్కారానికి ప్రతి రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ప్రత్యేక ట్రిబ్యునల్ ఉందన్నారు. అవసరమైన పక్షంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థను నేరుగా గాని లేదా 15100 లేదా 08812 224555 ద్వారా సంప్రదించి సాయం పొందవచ్చన్నారు. న్యాయవాది రత్నప్రసాద్, ప్రేమాలయం నిర్వాహకులు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.