
మృతదేహంతో రెండో రోజూ ఆందోళన
యలమంచిలి: కొంతేరులో ఆత్మహత్య చేసుకున్న చింతా లక్ష్మీ నర్సమాంబ మృతదేహంతో రెండో రోజు కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. ప్రేమలో విఫలమై కొడుకు చనిపోవడం, ప్రియురాలి తండ్రి కోర్టులో కేసు వేయడంతో మనస్తాపానికి గురై నర్సమాంబ శనివారం ఉరి వేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె మృతదేహంతో ప్రియురాలి ఇంటి ముందు ఆందోళన చేశారు. శనివారం రాత్రి పోలీసులు వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులకు నచ్చచెప్పి మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆదివారం పోస్టుమార్టం పూర్తి చేసి తిరిగి కొంతేరు తీసుకొచ్చి కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పగించారు. మరోసారి మృతదేహంతో ఆందోళన దిగారు. ఆందోళన పెరిగి ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం కనిపించడంతో గ్రామ పెద్దలు, పోలీసులు స్పందించారు. ప్రియురాలి తండ్రిపై కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించి, మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.