
డ్వాక్రా గ్రూపుల్లో అవినీతి
వీరవాసరం: వీరవాసరం మండలం నందమూరి గరువులో డ్వాక్రా గ్రూపుల్లో భారీ అవినీతి చోటుచేసుకుంది. సుమారుగా రూ.కోటి మేరకు డ్వాక్రా సభ్యుల సొమ్ము పక్కదారి పట్టింది. నందమూరు గరువులో 68 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. నందమూరి గరువు గ్రామ సంఘం వీవోఏగా ముక్కు సత్యవాణి అలియాస్ బోడపాటి సత్యవాణి 2021లో, ఆదర్శ నందమూరి గరువు సంఘం వీవోఏగా పోతుల నాగ స్వాతి 2022లో చేఆరు. గత మూడు సంవత్సరాలుగా డ్వాక్రా గ్రూపు సభ్యుల అనుమతి లేకుండా పొదుపు ఖాతాల నుంచి డబ్బులు గ్రామ సంఘం అకౌంట్కు బదిలీ చేస్తున్నారు. గ్రామ సంఘం ఖాతా నుంచి సీ్త్ర నిధి ద్వారా డ్వాక్రా సంఘ సభ్యులకు సంబంధం లేని వ్యక్తులు ఖాతాల్లోకి నిధులను తరలించారు. సత్యవాణి సుమారు రూ.39,14,700 పక్కదారి పట్టించగా.. పోతుల నాగస్వాతి రూ.43.63 లక్షలు పక్కదారి పట్టించింది.
ఇది గమనించి ప్రభ గ్రూపు సభ్యులు ఏపీఎం జ్యోతి రాణి దృష్టికి, గ్రామంలోని నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఏపిఎం అప్రమత్తమై రికార్డులను పరిశీలించడంతో సుమారు రూ.85 లక్షల మేర అవినీతి చోటుచేసుకుందని గుర్తించారు. ఇదే విషయాన్ని జిల్లా స్థాయి అధికారులకు నివేదించారు. 68 స్వయం సహాయ క సంఘాల్లోని రికార్డులను పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు.
సత్యవాణి సుమారు రూ.18 లక్షల నగదును తిరిగి ఆయా డ్వాక్రా సంఘ గ్రూపు నిధులకు జమ చేయించారు. గత మూడేళ్ల నుంచి ఇంత పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంటే కనీసం పట్టించుకోలేదని సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు సిబ్బంది ఏం చేస్తున్నారంటూ డ్వాక్రా మహిళలు నిలదీస్తున్నారు. దీనిపై ఏపీఎం జ్యోతిరాణి స్పందిస్తూ.. ఇద్దరు వీవోఏల పరిధిలో సుమారు రూ.85 లక్షల మేర అవినీతి చోటు జరిగిందని.. సత్యవాణి నుంచి రూ.18 లక్షల మేర నగదును తిరిగి జమ చేయించామని చెప్పారు. పరారీలో పోతుల నాగస్వాతిపై వీరవాసరం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సొమ్మును రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.