
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామిని భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఉదయానికే ఆలయానికి చేరుకుకోవడంతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. పుట్టలో పాలు పోసేందుకు, పాల పొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసేందుకు అధిక సమయం వేచి ఉండాల్సి వచ్చింది. స్వామిని దర్శించుకున్న అనంతరం నాగబంధాల వద్ద పూజలు చేశారు. అదేవిధంగా గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సహాయ కమిషనర్ శ్రీదేవి, సిబ్బంది పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ మాట్లాడుతూ ఆలయ ఆవరణలో వాహనాల పార్కింగ్ రుసుము వసూలు చేసుకునేందుకు లైసెన్సు హక్కు ఒక సంవత్సర కాలానికి కల్పించేందుకు ఈనెల 17న టెండర్ కం బహిరంగ వేలం జరుగుతుందని తెలిపారు.
ఆటో చోరీపై ఫిర్యాదు
భీమవరం: భీమవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి రాయలంలోని ఇంటి ముందు నిలుపుదల చేసిన ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని సీఐ జి. కాళీచరణ్ తెలిపారు. ఈ నెల 11న నిలుపుదల చేసిన ఆటోను యజమాని వై.తాతారావు 12న ఉదయం చూసే సరికి లేకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు. కనిపించకపోవడంతో ఆదివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
వైభవంగా శ్రీనివాసుడి కల్యాణం
జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరిలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు నల్లూరు రవికుమార్ ఆచార్యులు కల్యాణ తంతును జరిపించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వీక్షించి తరించారు. ఏర్పాట్లను ఈవో మాణికల రాంబాబు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు