
మందుబాబుల వీరంగం
ద్వారకాతిరుమల: స్థానిక ఒక మద్యం దుకాణం వద్ద ఆదివారం సాయంత్రం కొందరు మందుబాబులు వీరంగం సృష్టించారు. షాపులో యువకుడితో ఘర్షణకు దిగారు. బీరు బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. కొందరు వ్యక్తులు, వెంకటకృష్ణాపురానికి వెళ్లే మార్గంలోని షాపులో మద్యం సేవిస్తున్నారు. మద్యం షాపులో పనిచేసే యువకుడికి, వారికి మధ్య ఘర్షణ జరిగింది. ఇది కాస్తా కొట్లాటకు దారితీసింది. బీరు బాటిళ్లతో దాడులు చేసుకున్నారు. అడ్డు వెళ్లిన గ్రామానికి చెందిన భీమవరపు అంజిబాబుపై దాడి చేశారు. అంజిబాబు తలకు తీవ్ర గాయాలయ్యాయి. లక్కవరానికి చెందిన మరో వ్యక్తి సైతం గాయపడ్డాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులను సైతం మందుబాబులు లెక్కచేయకుండా కొట్టుకున్నారు. క్షతగాత్రులను స్థానిక పీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం 108లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం ఏరులై పారుతోందని, మందుబాబుల ఆగడాలు పెరిగిపోయాయని స్థానికులు అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా షాపుల వద్ద సిట్టింగ్లు ఏర్పాటు చేసి, మందుబాబులను ప్రోత్సహిస్తుండటమే గొడవలకు కారణమని పలువురు ధ్వజమెత్తుతున్నారు.